– ప్రతిపక్షాల వద్ద పాఠాలు నేర్చుకునే స్థితిలో లేము
– బీఆర్ఎస్ హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం
– మూసీ సుందరీకరణతో తాత్కాలిక సమస్యలే
– ప్రక్షాళన జరిగాక లక్షలాది మందికి మేలు
– రేవంత్ నిశ్శబ్ద విప్లవ నాయకుడన్న మల్లు రవి
హైదరాబాద్, స్వేచ్ఛ : సీఎం రేవంత్ రెడ్డి నిశ్శబ్ధ విప్లవ నాయకుడని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రశంసలతో ముంచెత్తారు. ఆదివారం గాంధీభవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమిళనాడులో కరుణానిధిని, జయలలితను విప్లవ నాయకులు అంటారని అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కూడా అలా పిలవాలని సూచించారు.
లక్షల మందికి మంచే జరుగుతుంది…
ప్రత్యామ్నాయం లేకుండా మూసీ సుందరీకరణ సాధ్యం కాదని తమకు తెలుసని చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాల దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, గత పాలకులు రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మూసీ వల్ల ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులుంటాయని, ప్రక్షాళనతో హైదరాబాద్లో లక్షల మందికి లాభం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎంగా రాత్రి పగలు కష్టపడుతున్నారు…
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం పగలు, రాత్రి కష్టపడుతున్నారని చెప్పారు మల్లు రవి. హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలబెట్టాలని కంకణం కట్టుకున్నారని, యువకుల కోసం, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను తీసుకొచ్చారని తెలిపారు. సీఎం రాజ్యాంగ విలువల్ని కాపాడుతుంటే, రాజ్యాంగ హక్కులను కాలరాయాలని బీజేపీ, బీఆర్ఎస్ చూస్తున్నాయని మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం అయింది. 10 ఏళ్లలో 5 వేల పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్రంలో 28 అంతర్జాతీయంగా ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యా భోజన, వసతులతో నిర్మిస్తోంది.
ఒక్కోదానికి రూ.150 కోట్లు మరి…
ఒక్క స్కూల్ నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చు చేస్తోంది. 2500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులందరికి ఒకే చోట విద్యను అందించబోతోంది’’ అని వివరించారు. వేల కోట్లతో కట్టిన సచివాలయం, ప్రజాభవన్ ఎవరికి ఉపయోగపడుతున్నాయని ప్రశ్నించారు మల్లు రవి. గత పాలకులకు సౌకర్యాల కోసం ప్రజా ధనాన్ని వృథా చేశారన్నారు.
also read : తెలంగాణ ఉద్యమానికి అలయ్ బలయ్ స్ఫూర్తి : సీఎం రేవంత్ రెడ్డి