Mysterious Cylinder Found On Railway Track: దేశ వ్యాప్తంగా కొంతమంది దుండగులు రైలు ప్రమాదాలకు పాల్పడుతున్నారు. గత కొంతకాలంగా రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తులు సిలిండర్లు, మట్టి దిమ్మెలు, ఇనుప రాడ్లు, సిమెంట్ దిమ్మెలు పెడుతూ ప్రమాదాలు చేసేందుకు యత్నిస్తున్నారు. పైలెట్ల అప్రమత్తతో రైల్వే శాఖ ఊపిరిపీల్చుకుంటుంది. ఒకవేళ ఏదైనా అనుకోని విధంగా ప్రమాదాలు జరిగిఉంటే నష్టాన్ని ఊహించనది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రైలు ప్రమాదాలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల వరుస ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, ఆదివారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్లోని రూర్కీ సమీపంలోని రైల్వే ట్రాక్లపై ఎల్పీజీ సిలిండర్ కనిపించింది. సిలిండర్ను గూడ్స్ రైలు లోకో పైలట్ గుర్తించాడు. అతను వెంటనే అధికారులను అప్రమత్తం చేశాడు. రైలు పట్టాలు తప్పకుండా నిరోధించాడు. సంఘటనా స్థలానికి ఒక పాయింట్మెన్ను పంపించి సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించారు.
ధంధేరా, లాండౌరా స్టేషన్ల మధ్య ఉదయం 6.35 నిమిషాలకు గూడ్స్ రైలు వెళ్తోంది. ఈ క్రమంలోనే ట్రాక్ పై సిలిండర్ ను గుర్తించిన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. ఖాళీ సిలిండర్గా గుర్తించారు. ఆగస్టు నుంచి ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 18 ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో రైల్వే భద్రతపై ఆందోళన పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి.