Alai Balai : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్య మంత్రులు కలసి మెలసి అభివృద్ది కోసం పరస్పరం పని చేయాలని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవాలన్నారు. ఐకమత్యంతో ముందుకెళ్లాలని, దేశంలోనే తెలుగు రాష్ట్రాలను అగ్రభాగాన నిలపాలని కోరారు. 2005లో రాజకీయాలకు సంబంధం లేకుండా, ప్రేమ, ఆప్యాయత, అనురాగాల కోసం అలయ్ బలయ్ను ప్రారంభించామన్నారు. ప్రేమ, ఆత్మీయత, ఐక్యతను చాటుకోవాలన్నదే అలయ్ బలయ్ లక్ష్యమని పేర్కొన్నారు. పలువురు గవర్నర్లు రావడంతో దేశమంతా నగరానికి వచ్చినట్టుగా అనిపించిందని చెప్పారు.
ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత – తోటివారి ఆలోచనలను, భావాలను గౌరవించటం కూడా ఐక్యత కిందకే వస్తుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య అన్నారు. అందరినీ ఒకే వేదిక మీద చూడటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలకు లిమిట్ ఉంటుందని, అది కేవలం సిద్ధాంతాల వరకే పరిమితమవ్వాలన్నారు. నేతలు వ్యక్తిగత దూషణలు చేస్తే కార్యకర్తలు కూడా అలాగే ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. దీంతో సమాజానికి చెడు జరుగుతుందని, ఐక్యత, సమష్టి కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. సమైక్యత వారధుల నిర్మాణం ప్రతిఒక్కరి సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు వెంకయ్య నాయుడు. పండుగలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు సామాజిక ప్రాధాన్యత కూడా ఉందని పేర్కొన్నారు. సమైక్యత అంటే అందరూ ఒకేమాట మీద నిలబడటమే కాదు, ఇతరుల ఇష్టాలను గౌరవించటం కూడా అని తెలిపారు. సమాజంలో ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు.
ALSO READ : ‘అలయ్ బలయ్’కి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి… తెలంగాణ సాంప్రదాయలపై దిశానిర్దేశం
అదిరిపోయే వంటకాలు – అలయ్ బలయ్ కార్యక్రమ అతిథులకు స్పెషల్ వంటకాలను ఏర్పాటు చేశారు. ఘుమఘుమలాడే, నోరూరించే తెలంగాణ వంటలను ప్రత్యేకంగా తయారు చేశారు. నోరూరించే తెలంగాణ సంప్రదాయక వంటకాలు చికెన్, మటన్ బిర్యానీ, చేపల పులుసు, చిరు ధాన్యాల ఉత్పత్తులు, జొన్న రొట్టె, సర్వపిండి, ఇతర పిండి వంటకాలు, గారెలు, బూరెలు వండారు. ఇవే కాకుండా బోటి, తలకాయ కూర, చేపల వేపుడు, చికెన్ వేపుడు, నల్ల, పాయ వంటి 60 రకాల స్పెషల్ వంటకాలను అతిథులకు వడ్డించినట్టు కమిటీ వెల్లడించింది.