Jagan Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎప్పటిలానే హామీల చిట్టా చదివి వినిపించారు. వెంకన్న విగ్రహాన్ని బహుకరించి.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వేడుకున్నారు. సుమారు 50 నిమిషాల పాటు వారిద్దరి భేటీ జరిగింది. అయితే, కేవలం రాష్ట్ర సమస్యలపై మాత్రమే చర్చించారా? లేదంటే, రాజకీయ అంశాలూ చర్చకు వచ్చాయా? అనేది ఆసక్తికరం.
ఎంతకాదన్నా జగన్ కు, ఏపీ సర్కారుకు కేంద్రం ఆశీస్సులు దండిగా ఉన్నాయనేది వాస్తవం. వారిద్దరూ రహస్య స్నేహితులని విపక్షం పదే పదే విమర్శిస్తుంటుంది. అయితే, ఇటీవల బీజేపీ.. జనసేనకు మరింత దగ్గర అవుతుండటం.. విశాఖలో మోదీ, పవన్ భేటీ కావడంతో జగన్ అలర్ట్ అయ్యారని అంటున్నారు. రాష్ట్ర సమస్యలు ఏకరువు పెడుతూనే.. రాజకీయ అంశాలు కూడా చర్చించారని భావిస్తున్నారు. కేవలం సమస్యల చిట్టా వినిపించడానికైతే.. ఏ పావుగంట సమయం సరిపోతుంది. అలాంటిది ఏకంగా 50 నిమిషాల భేటీ జరిగిందంటే సంథింగ్ సంథింగ్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం ప్రధాని మోదీకి సీఎం జగన్ చేసిన విన్నపాలు..
–రుణ పరిమితిలో కోతలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి. గత ప్రభుత్వం పరిమితికి మించి తీసుకున్న రుణాలను వైసీపీ సర్కార్ సర్దుబాటు చేస్తుంటే కేంద్ర ఆర్థికశాఖ రుణాలపై పరిమితి విధిస్తోంది. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోంది. అందుకే పీఎం మోదీ జోక్యాన్ని కోరుతున్నాం.
–విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలు పరిష్కరించాలి
–ఏపీకి ప్రత్యేక హోదాపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి
–విశాఖ మెట్రో రైల్ ఏర్పాటుకు సహకారం అందించాలి
–32,625.25 కోట్ల పెండింగ్ బకాయిలు ఇవ్వాలి
–పోలవరం కోసం రాష్ట్రం చేసిన ఖర్చు 2,937.92 కోట్లు చెల్లించాలి
–పోలవరం పునరావాసానికి 10,485.38 కోట్లు మంజూరు చేయాలి
–తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన 6,886 కోట్లు ఇప్పించాలి
–12 జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలి
–కడపలో నిర్మించనున్న స్టీల్ప్లాంట్కు ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి