Cyber Attacks On Iran| ఇరాన్- ఇజ్రాయెల్ల మధ్య యుద్ధంతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అట్టుడుకుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ లో పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగాయి. అణు స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. సైబర్ అటాక్స్ తో ప్రభుత్వంలోని న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖల సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. కీలకమైన సమాచారం చోరీకి గురైందని ఇరాన్ సైబర్ స్పేస్ విభాగం కూడా ధృవీకరించింది. తమ అణు స్థావరాలతో పాటు ఇంధనం సరఫరా చేసే నెట్ వర్క్ లు, మున్సిపల్, ట్రాన్స్ పోర్ట్ నెట్ వర్క్ లు.. ఇలా.. సైబర్ దాడులకు గురైన వాటికి సంబంధించి పెద్ద లిస్టే ఉందని పేర్కొంది.
Also Read: లెబనాన్ ఐరాస కేంద్రంపై దాడి చేసిన ఇజ్రాయెల్.. ఖండించిన ప్రపంచ దేశాలు
శనివారం పెద్ద సంఖ్యలో సైబర్ దాడులను ఎదుర్కొన్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడులతో ఇరాన్ ప్రభుత్వంలోని దాదాపు అన్ని శాఖల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. తమ అణు కేంద్రాలే లక్ష్యంగా సైబర్ దాడులు జరిగినట్లు ఇరాన్ తెలిపింది. ఇరాన్ ప్రభుత్వంలోని దాదాపు ప్రతి శాఖ ఈ సైబర్ అటాక్స్ వల్ల ప్రభావితమైందని, సమాచారం చోరీ జరిగిందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇంధన పంపిణీ, మున్సిపల్ సేవలు, రవాణా, ఓడరేవుల వంటి కీలకమైన నెట్వర్క్లపైన కూడా సైబర్ దాడులు జరిగినట్లు వివరించారు.
అణుస్థావరాలు, కీలక శాఖలపై భారీ స్థాయిలో జరిగిన సైబర్ దాడులను ఇరాన్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై విచారణ చేపట్టింది. ఇది ఎవరి పని? అని తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. ఈ రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. వార్ కి సై అంటే సై అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సైబర్ దాడులు జరగడం ఆ ఉద్రిక్తతలను మరింత పెంచినట్లైంది.