Vijayawada Locopilot Murder| విజయవాడ రైల్వే స్టేషన్లో లోకో పైలెట్ హత్య మిస్టరీ వీడింది.. ఎబినేజర్ను హత్య చేసిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని బీహార్కు చెందిన దేవ్ కుమార్గా గుర్తించారు. విజయవాడలో లోకో పైలట్ ఎబినేజర్ను విధుల్లో ఉండగా.. దేవ్కుమార్ ఇనుప రాడ్డుతో ఆయన తలపై బలంగా కొట్టారు. ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఎబినేజర్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. ఐదు టీమ్లుగా ఏర్పడి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని నిందితుడి కోసం గాలించారు.
ఈ క్రమంలో అప్పి యార్డు సమీపంలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో గాలింపు చేపడతుండగా నిందితుడు పోలీసులకు కనిపించాడు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. తన పేరు దేవ్ కుమార్, బిహార్లోని షైనీ దర్ఫారీ అని చెప్పినట్లు తెలుస్తోంది. అతడు జీవనాధారం కోసం విజయవాడ రాగా.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దేవ్కుమార్ పనిచేసి సంపాదించే డబ్బులు సరిపోక రాత్రిపూట ఒంటరిగా కనిపించిన వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఒకవేళ వాళ్లు ఎదురు తిరిగితే దాడి చేసేవాడు.
Also Read: బీర్ కోసం పసిబిడ్డను అమ్ముకున్న తల్లితండ్రులు.. పోలీసులకు దారుణమైన పరిస్థితిలో దొరికిన బిడ్డ
ఇదే క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్ ఎఫ్ క్యాబిన్ దగ్గర ఈ నెల 10న లోకో పైలట్ ఎబినేజర్ కనిపించాడు..నిందితుడు అతన్ని డబ్బులు డిమాండ్ చేయగా.. లేవు అనడంతో… కోపంతో ఇనుప రాడ్డుతో లోకో పైలట్ తలపై కొట్టి.. జేబులో ఉన్న 750 తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత మరికొందరిని నిందితుడు డబ్బుల కోసం బెదిరించినట్లు తేల్చారు పోలీసులు.. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు.
విజయవాడ రైల్వే యార్డుల్లో రాత్రి వేళల్లో గంజాయి మూకలు, అసాంఘిక శక్తులు తిష్ట వేస్తున్నాయి. గత రెండేళ్లలో ఆరు హత్యలు జరిగాయి. రైల్వే పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షణ బాధ్యతలు మీదంటే మీదని రైల్వే , ఏపీ పోలీసులు పట్టించుకోక పోవడంతో ఘోరాలు జరుగుతున్నాయి. సమీప ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. రైల్వే యార్డుల్లో పనిచేసే కార్మికులు రాత్రి వేళల్లో కూడా విధులు నిర్వర్తిస్తుంటారు. గతంలో రైల్వే యార్డుల్లో హైమాస్ట్ లైట్లతో వెలుగులతో ఉండేవి. కొన్నేళ్లుగా పొదుపు పేరుతో చీకట్లో పనిచేయాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు.
Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!
విజయవాడ రైల్వే జిఆర్పీ పరిధిలో 70మంది పోలీసులు విధులు నిర్వర్తించాల్సి ఉంటే ప్రస్తుతం 17మంది మాత్రమే సిబ్బంది అందుబాటులో ఉన్నారు. కనీసం మూడో వంతు కూడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. లోకో పైలట్లు, మెకానికల్, గూడ్స్ షెడ్లలో పనిచేసే కార్మికులు భయంభయంగా పనిచేయాల్సి వస్తున్నా రైల్వే ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.