Rohithreddy : ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనపై ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ హైకోర్టులో రోహిత్రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మనీలాండరింగ్ జరగనప్పుడు తనపై ఈసీఐఆర్ నమోదు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. పార్టీ మారితే రూ. 100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని ఇక్కడ డబ్బు ఎక్కడా లభ్యం కాలేదని రోహిత్రెడ్డి తరఫున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మనీలాండరింగ్కు అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని స్పష్టం చేశారు.
రోహిత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సమాధానం ఇచ్చారు. ఈసీఐఆర్ నమోదు చేస్తే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. ఇప్పటికే ఈడీ అడిగిన అన్ని వివరాలు ఇచ్చినందున మరోసారి విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మరోవైపు రెండుసార్లు విచారణకు హాజరైన రోహిత్ రెడ్డి మంగళవారం రాలేదు. మంగళవారం విచారణకు రావాలని రోహిత్రెడ్డికి నోటీసులు ఇచ్చామని ఈడీ కోర్టుకు తెలిపింది. విచారణకు రాకపోవడంతో ఈ నెల 30న మళ్లీ రావాలని నోటీసులు ఇచ్చామని పేర్కొంది. తాము ఇచ్చిన సమన్లలో అడిగిన అన్ని వివరాలు ఉన్నాయని వివరించింది. వాదనలు విన్న హైకోర్టు రోహిత్రెడ్డి పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, ఈడీలను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 5కి వాయిదా వేసింది.