Cm Chandrababu Chiru : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికి ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.
రూ.కోటి చెక్కు అందజేత…
అనంతరం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. కోటి రూపాయలను చిరు విరాళంగా అందజేశారు. వరద బాధితుల కోసం వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, సినీ సెలబ్రిటీలు మేము సైతం అంటూ వచ్చారు. దీంతో అప్పట్లోనే విరాళం ప్రకటించిన చిరంజీవి, పండుగ పూట చంద్రబాబును కలిసి నేరుగా చెక్కు అందించారు.
చెరో రూ.50 లక్షలు…
తన తరుఫున రూ.50 లక్షలు, రామ్ చరణ్ తరుఫున మరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించి ఆ మొత్తాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చారు. దీంతో వరద బాధితులకు అండగా నిలిచిన మెగాస్టార్ కు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో తనవంతుగా చిరు ముందుండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అనంతరం సీఎం, స్వయంగా కారు వరకూ వచ్చి చిరంజీవికి సెండ్ ఆఫ్ ఇచ్చేశారు.
వరదలతో ఆగమాగం…
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో వరదల బీభత్సం చెలరేగింది. తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ వాసులు వరదల కారణంగా నరకయాతన అనుభవించారు. చాలా మంది ఇళ్లు, ప్లాట్లు, సామాన్లు, విలువైన వస్తువులను పొగొట్టుకున్నారు. వీరిని ఆదుకునేందుకు చాలా మంది ప్రముఖులు ముందుకు రావడం గమనార్హం.