Ind vs Ban T20i : ఉప్పల్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఆతిథ్య భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టీమిండియాకు ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేక చతికిలబడింది. 298 పరుగుల భారీ టార్గెట్’తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 164 పరుగులకే చేతులెత్తేసింది.
20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో 133 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లా బ్యాటర్లలో హృదోయ్ 63 పరుగులు (42 బంతులు) , లిటన్ దాస్ 42 పరుగులు (25 బంతులు) చేశారు. దీంతో బంగ్లా ఓటమి ఖాయమైపోయింది.
భారత్ సీరిస్ క్లీన్ స్వీప్…
ఉప్పల్ లో మూడో టీ20ని కైవసం చేసుకోవడం ద్వారా భారత్ 3 మ్యాచ్ల సిరీస్ని 3-0తో ఒడిసి పట్టుకుంది. తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్, రెండో మ్యాచ్లో 86 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అంతకుముందు 2 టెస్టుల సిరీస్లో బంగ్లాదేశ్ను 2-0తో భారత్ చిత్తు చేసింది.
సంజూ శాంసన్ సూపర్ ప్లే…
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సంజూ ఒక్క ఓవర్లనే ఏకంగా 30 పరుగులను రాబట్టుకున్నాడు. పదో ఓవర్లో రిషద్ వేసిన రెండో బంతి మినహా ఆ ఓవర్లో అన్ని బంతులనూ సిక్సర్లుగా స్టాండ్స్ కు పంపించి 40 బంతుల్లోనే సెంచరీ నెలకొల్పాడు. దీంతో టీ20ల్లో సంజు శాంసన్ తన తొలి టీ20 సెంచరీని కొట్టగలిగాడు. 111 పరుగుల వద్ద ఔటయ్యాడు.
సూర్య మెరుపులు…
ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 75, హార్దిక్ పాండ్యా 47, రియాన్ పరాగ్ 34 పరుగులు చేశారు. భారత బౌలింగ్ లో రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీసి బంగ్లాను దెబ్బతీశాడు. బంగ్లాదేశ్లో తౌహిద్ హృదయ్ 63 పరుగులు చేయగా, ఫేస్ బౌలర్ తంజిమ్ హసన్ సాకిబ్ 3 వికెట్లతో మెరిశాడు.
సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ…
అయితే రోహిత్ శర్మ 100 (35 బంతుల్లో) తర్వాత అత్యంత వేగంగా 100 రన్స్ చేసిన రెండో టీమిండియా ఆటగాడిగా రికార్డు సాధించాడు. మరోవైపు టీ20ల్లో వేగంగా శతకాలు బాదిన జాబితాలో డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో), రోహిత్ శర్మ (35), జాన్సన్ చార్లెస్ (39) తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక సంజు శాంసన్ 40 బంతుల్లో శతకంతో నాలుగో స్థానంలోకి దూసుకురావడం గమనార్హం.
వరుణుడి ఆశీర్వాదం…
మూడో టీ20లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు హైదరాబాద్ ఉప్పల్ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. సాయంత్రం జల్లులు కురిసే అవకాశముందని గతంలోనే వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా హైరానా పడ్డారు. కానీ చివరకు మ్యాచ్ ఆసాంతం వాతావరణం అనుకూలించింది.
మరోవైపు ఉప్పల్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుని పరుగుల సునామీ సృష్టించింది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కారణంగా అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. చివరి రైలు అర్ధరాత్రి ఒంటి గంటకు బయలుదేరనున్నట్లు సమాచారం.
also read : సంజు ఫాస్టెస్ట్ సెంచురీ.. ఆ ఒక్క ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు, బంగ్లా బెంబేలు!