Bagamathi Train : తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును భాగమతి ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టిన ఘటన తెలిసిందే. అయితే ఈ దుర్గటనలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు రైల్వే అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో విచారణ చేయించనున్నట్లు సమాచారం. రైల్వే సిబ్బంది తప్పిదాలతోనే ఈ ప్రమాదం జరిగిందా లేక సిగ్నల్ వ్యవస్థను ఎవరైనా కావాలనే హ్యాక్ చేశారా అనే కోణంలో దర్యాప్తు జరగనున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో రైల్వే అధికారులకు ఇప్పటికీ పక్కా కారణం కనుగొనలేకపోతున్నారు. ఫలితంగా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించలేకపోతున్నారు.
లూప్ లైన్ కి మళ్లడంపైనే అనుమానాలు…
ఆగి ఉన్న గూడ్స్ రైలును, భాగమతి ఎక్స్ప్రెస్ రైలు (12578) అత్యంత వేగంగా బలంగా ఢీకొట్టింది. అయితే రైలు మెయిన్ లైన్లోనే వెళ్లేలాగా సిగ్నల్ ఇచ్చినా, సదరు రైలు మాత్రం మూసేసి ఉన్న లూప్ లైన్ వైపు మళ్లడంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రైలు ఎందుకు అలా మళ్లింది ? ఎవరు దాని దారి మళ్లించారన్నది అందరిని వేధిస్తున్న ప్రశ్న. ఈ ఘటనపై లోతైన విచారణ జరుగుతోందని, తాము సైతం అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని దక్షిణ రైల్వే జీఎం ఆర్ఎన్ సింగ్ తెలిపారు. త్వరలోనే రైలు ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయని వివరించారు. ఘటన వెనక ఉగ్రవాదులు ఉండి ఉండొచ్చనే కోణం రైల్వేశాఖను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేస్తున్నట్లు సమాచారం.
రాహుల్ ఫైర్…
మరోవైపు రైలు ప్రమాదం ఘటనపై కేంద్రం సీరియస్గా ఉందట. ఇక ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నిన్నటి రైలు ప్రమాదం బాలాసోర్ ఘోర ప్రమాదాన్ని తలిపించిందని ఆవేదన వెలిబుచ్చారు.
రైలు ప్రమాదాలు లెక్కలేనన్ని జరుగుతున్నాయని, ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడుతున్నారన్నారు. అయినా కేంద్రం మాత్రం ఎటువంటి గుణపాఠాలూ నేర్చుకోవడంలేదన్నారు. పైస్థాయి నుంచే జవాబుదారీతనం మొదలవుతుందని, ఈ ప్రభుత్వం ఇంకెప్పుడు మెల్కొంటుందోనని ప్రశ్నించారు. ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడితే ప్రభుత్వంలో చలనం వస్తుందోనన్నారు.
also read : పండుగ రోజు ఇటువంటి కానుక ఊహించరు కూడా.. ఆల్ ఫ్రీ అంటూ తెగ పంచేశారు.. ప్రజలు క్యూ కట్టారు