Vijayasai reddy Tweet: సైలెంట్ గా ఉన్నారనుకుంటున్న ఆ నేత విమర్శలకు పదునెక్కిందా.. లేక తానున్నానని నిరూపించుకొనే తాపత్రయమా.. అంటూ జోరుగా రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చ సాగుతోంది. ఆయన ఎవరో కాదు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఎన్నికల వరకు ఈయన వైసీపీ రెండో బాస్ గా ఉండేవారు. ఎన్నికలు ముగిశాయి.. తొలుత అక్కడక్కడా కనిపించినా.. ఆ తరువాత సైలెంట్ అయ్యారు. ఇటీవల మాజీ సీఎం జగన్ నిర్వహిస్తున్న నియోజకవర్గాల సమీక్షల వద్ద కూడా కనిపించని పరిస్థితి. కానీ ఎక్స్ వేదికగా కూటమిపై విమర్శలు గుప్పించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈసారి తన విమర్శల బాణం టీడీపీ సోషల్ మీడియాపై ఎక్కుపెట్టి.. పలు సూచనలు కూడా సూచించారు. అది కూడా మేక తోక ఎత్తకండి.. ఆ ఇద్దరి మాట వినకండి అంటూ ట్వీట్ చేశారు.
ఏపీలో టీడీపీ కూటమి, వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ సాగుతోంది. ఒకరు విమర్శిస్తే చాలు.. క్షణాల్లో ప్రతి విమర్శలు వస్తున్నాయి. ఈ వార్ తిరుమల లడ్డు వ్యవహారం నుండి రేగుతుండగా.. రోజురోజుకు ఎక్స్ వేదికగా ట్వీట్ ల వర్షం సాగుతోంది. అయితే ఎక్స్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ సోషల్ మీడియాను ఉద్దేశించి కొంచెం ఘాటుగానే స్పందించారు.
తెలుగు దొంగల పార్టీ (పేరుకు తగినట్లుగానే) జ్ఞానం, మర్యాద, అవగాహన లేని పోకిరీలను, పనికిమాలిన కులగజ్జి గాళ్లని, గూండాలని, గోహంతకులని, హిందూవ్యతిరేకులని, నాస్తికులని, రేపిస్టులని, టీడీపీ సోషల్ మీడియా లో పోస్టులు పెట్టడానికి, విపక్ష నాయకులు పెట్టిన పోస్టులు మీద వ్యక్తిగత దూషణలతో,…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 11, 2024
ఆయన ట్వీట్ ఆధారంగా.. టీడీపీని తెలుగు దొంగల పార్టీగా సంభోధించి.. జ్ఞానం, మర్యాద లేని పోకిరీలను సోషల్ మీడియాలో విమర్శలు చేసేందుకు టీడీపీ నెలసరి జీతాలు చెల్లిస్తుందన్నారు. తప్పుడు పేర్లతో విమర్శలు చేయడం.. పోలీస్, న్యాయవ్యవస్థకు దొరకకుండా కామెంట్స్ పెట్టడం కాదు.. ధైర్యం ఉంటే అసలు పేర్లతోనే పోస్టులు పెట్టండి అంటూ సవాల్ విసిరారు. మీ ముఠా నాయకుడి దృష్టిలో పడాలని, హద్దులు దాటుతున్నారు.. ఘోరంగా నష్టపోయేది మీరే అంటూ హితవు పలికారు.
Also Read: Jagan INDIA Bloc: జగన్ తీరు అప్పుడలా.. ఇప్పుడిలా.. ఇండియా కూటమి వైపు చూపులు?
మీ ఇద్దరు బాస్ ల కోసం మేక తోక ఎత్తకండి, అలా చేస్తే ఫూల్స్ తప్ప ఏమి కారంటూ.. మీ పార్టీ ఘోరంగా నష్టపోయేందుకు మీరే కారకులవుతారన్నారు. ఇలా ఆయన చేసిన ట్వీట్ కి టీడీపీ సోషల్ మీడియా కూడా అంతే స్థాయిలో రివర్స్ అటాక్ చేసింది. నెలసరి జీతాలు ఇచ్చింది మీరే కాబట్టి.. మీకు ఆ ఆలోచన వచ్చిందని, తప్పుడు పేర్లతో విమర్శలు చేసే సంస్కృతి మీదేనంటూ.. ఆయన ట్వీట్ కి కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మాజీ సీఎం జగన్.. పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నా.. అధికారంలో ఉండగా వెంట ఉన్న బడా నేతలు కనిపించడం లేదు. అయితే అవసరమైనప్పుడు మొత్తం నేతలను రంగంలోకి దించేందుకు వైసీపీ వ్యూహ రచన చేస్తుందని, ఆ ప్రయత్నంలోనే గ్రామాల బాట పట్టే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అప్పుడే విజయసాయిరెడ్డి లాంటి నేతలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది.
అప్పటి వరకు సోషల్ మీడియా ద్వారా అధికార పార్టీని విమర్శిస్తూ.. టీడీపీ సోషల్ మీడియాకు అడ్డుకట్ట వేయాలన్నది ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయం కావచ్చని, అందుకే తాజాగా తన ట్వీట్ ద్వారా.. వారిపై గురి పెట్టారన్న వాదన వినిపిస్తోంది.