Express train collides with goods train near Chennai: చెన్నై శివారులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును మరో ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో బోగీలు కాలిపోయాయి.
వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్టె స్టేషన్ లో ఓ గూడ్స్ రైలు ఆగి ఉంది. ఈ రైలును మైసూర్ దర్భంగా భాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ నంబర్ 12578 ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్ ప్రెస్ ట్రైన్ 5 నుంచి 6 బోగీలు పట్టాలు తప్పాయి.
రైలు ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో రెండు బోగీలు మంటల్లో తగలబడుతున్నాయి. వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ స్టేషన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read: విమానంలో సాంకేతిక లోపం.. గాల్లోనే రెండు గంటలుగా చక్కర్లు.. బిక్కుబిక్కుమంటున్న 140 మంది ప్రయాణికులు!
ఈ రైలు ప్రమాదంలో కవరైపెట్టై ప్రాంతంలో పరిస్థితి భయానకంగా మారింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును భాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ 100 కి.మీ వేగంతో ఢీకొట్టింది. గ్రీన్ సిగ్నల్ రావడంతో లోకోపైలెట్ ముందుకు తీసుకెళ్లారని చెబుతున్నారు.
సిగ్నల్ రావడంతో వెళ్లిన ఎక్స్ ప్రెస్.. లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలు ను ఢీకొట్టిందని తెలుస్తోంది. ఫ్యాసింజర్ ట్రైన్ రెండు ఏసీ బోగీలతో పాటు మరో 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా నెల్లూరు, చెన్నై మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.