– బీఆర్ఎస్ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు
– మీ ఉడుత ఊపులకు బెదరం.. అభివృద్ధి ఆపం
– ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో ప్రజల్లో మత సామరస్యం
– అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యే లక్ష్యం
– ప్రభుత్వాన్ని అవమానించటమే పనిగా పెట్టుకుంటే ఊరుకోం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరిక
ఖమ్మం, స్వేచ్ఛ : రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను స్కూల్కు వెళ్లే రోజుల్లో మోకాళ్ళ లోతు నీళ్లు, గుట్టల మీదుగా 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వైరా దాకా వెళ్లి చదువుకునే వాడినని అన్నారు. తన బిడ్డ వాగు, రోడ్డు దాటుకుంటూ ఎలా బడికి పోతాడు, ఎలా తిరిగి వస్తాడు అని తన తల్లిదండ్రులు ఆందోళన చెందేవారని చెప్పారు.
మీ కోసమే డిజైన్లు చేశాం…
రాష్ట్రంలోని పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు పడవద్దు అని, ప్రతి తల్లి కోరికను మనసులో పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చొని డిజైన్లు చేశామని అన్నారు. మంత్రి మండలిలో చర్చించి డిజైన్లను ఖరారు చేశామని పేర్కొన్నారు.
అభివృద్ధి చేస్తున్నా విమర్శలా ?
కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కటి చేయటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు భట్టి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో ప్రజల్లో మత సామరస్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వాన్ని అవమానించటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యార్థులకు భోదన అందిస్తామని, సకల సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తామని వివరించారు. ఈ స్కూళ్ల నిర్మాణం కోసం ఈ ఏడాదికి రూ.5వేల కోట్లు కేటాయించామని చెప్పారు. మొదటి దశలో 28 స్కూళ్లకి శంకుస్థాపన చేసినట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఉడత ఊపులకు ఎవరూ భయపడరని, అభివృద్ధి ఆగదని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న గురుకులాలు కూడా కొనసాగుతాయని, అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తామని స్పష్టం చేశారు భట్టి.
Also read : సమగ్ర కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 60 రోజులే సమయం!