Ex CS Somesh Kumar : తెలంగాణలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఐజీఎస్టీ కుంభకోణంలోకి ఈడీ (ED) రంగ ప్రవేశం చేసింది. గతంలో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
భారీ స్థాయిలో నగదు అక్రమ చెలమణి జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం, కేసును సీఐడీకి అప్పగించింది. అయితే తాజాగా ఈడీ సైతం ఈ కేసులో రంగంలోకి దిగింది. వారందరిపై కేసులు సైతం నమోదు చేసి షాక్ ఇచ్చింది.
ఏ1గా వాణ్యిజ్య పన్నుల అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీస్, ఏ5గా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై కేసు బుక్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఖజానాకు భారీగా గండి…
ఐజీఎస్టీకి సంబంధించి దాదాపుగా రూ.1400 కోట్ల మేర ఐటీసీని క్లెయిమ్ చేశారు. ఫలితంగా సర్కారు ఖజానాకు గండి పడ్డట్లు సీసీఎస్ పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిగ్గు తేల్చారు. బోగస్ ఇన్వాయిస్లతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను క్లెయిమ్ చేశారని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ గతేడాది చేపట్టిన ఆడిట్లో భాగంగా గుర్తించింది.
రూ.వందల కోట్లలో కాదు వేలల్లోనే…
వస్తువుల పంపిణీ చేయకపోయినా, తప్పుడు ఇన్వాయిస్ లను సృష్టించినట్లు గుర్తించారు. రూ.వేల కోట్లలో స్కామ్ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం, పూర్తి స్థాయి దర్యాప్తు కోసం కేసును సీఐడీకి అప్పగించేసింది.
సోమేష్ కుమార్ పైనే అనుమానం…
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా, వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్కుమార్ చక్రం తిప్పారు. ఆయన కనుసన్నల్లోనే తాము సాఫ్ట్వేర్లో మార్పులు చేసేందుకు అంగీకరించామని కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్ అంగీకరించినట్లు సీసీఎస్ పోలీసులు అప్పట్లోనే బహిర్గతం చేశారు.
స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరిట ఏకంగా ఓ వాట్సప్ గ్రూపు సైతం ఏర్పాటు చేశారు సోమేశ్. దీని ద్వారానే సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేవారని సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
సోమేష్ సహకారంతోనే 75 సంస్థలకు సంబంధించి ఐటీ రిటర్నుల సమాచారం తెలియకుండా చేసేందుకు సాఫ్ట్ వేర్ ను మార్చారని, ఫలితంగా ఐటీసీ క్లెయిమ్లకు వీలు కల్పించారన్నారు. ఈ క్రమంలోనే సుమారుగా రూ.1400 కోట్ల మేర ఐటీసీ సొమ్మును క్లెయిమ్ చేసుకున్నట్లు గుర్తించారు.
Also Read : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. తెలంగాణలో యంగ్ ఇండియా స్కూళ్లు, ఇవీ ప్రత్యేకతలు
రంగంలోకి ఈడీ…
సోమేశ్కుమార్ ఆధ్వర్యంలోనే మొత్తం స్కాం జరిగిందని దర్యాప్తు సంస్థలు నిర్థారణకు వచ్చాయి. దీంతో ఆయా అధికారులకు సీఐడీ ఇప్పటికే నోటీసులు పంపింది. తాజాగా ఈడీ సైతం కేసు నమోదు చేయడం గమనార్హం.