YS Jagan vs TDP: జగన్ తన ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవని ఎందుకున్నారు? రాబోయే ముప్పును జగన్ ముందే పసిగట్టారా? పార్టీకి కష్టాలు తప్పవని ముందుగానే హింట్ ఇచ్చారా? అవుననే సంకేతాలు ఆ పార్టీ నేతల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
రాజకీయ నేతలు అప్పుడప్పుడు కొన్ని నిజాలు చెబుతారు. వైసీపీ అధినేత జగన్ సైతం కొన్ని నిజాలు బయటపెట్టారు. విలువలు, విశ్వసనీయత మనకు శ్రీరామరక్ష అని చెప్పుకొచ్చారు. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో రేపల్లె నుంచి వచ్చిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో కీలక విషయాలు బయటపెట్టారు.
కష్టాలనేవి శాశ్వతంగా ఉండవని.. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవని చెప్పకనే చెప్పేశారు అధినేత. ఈ విషయంలో కేడర్ను ముందుగానే అలర్ట్ చేసినట్టు కనిపిస్తోంది.
ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మళ్లీ మనమేనని చెప్పి కార్యకర్తలను ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారాయన. మీడియా ముందు కార్యకర్తల ముందు అదే మాట చెప్పడంతో బోర్ లేకుండా ఉండేందుకు తనదైన శైలిలో టీడీపీ పథకాల గురించి సెటైరికల్గా చెప్పే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు కూడా.
ALSO READ: అర్ధరాత్రి రక్తసిక్తమయిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి.. 12 మందికి తీవ్ర గాయాలు!
2019-2024 మధ్యకాలంలో ప్రజలకు మేలు చేశామన్నారు జగన్. అధికారంలోకి వచ్చిన టీడీపీ కేవలం 100 రోజుల్లో ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందన్న విషయాన్ని పదే పదే గుర్తు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. వైసీపీ పాలనలో అంత మంచి చేస్తే.. ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందో అన్నది చెప్పకుండానే తన ప్రసంగాన్ని ముగించారు జగన్.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవన్న జగన్ మాటలను గమనిస్తున్నారు ఆ పార్టీలోని కొందరు నేతలు. ఈ లెక్కన రానున్న రోజుల్లో తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నోరు ఎత్తుకుండా సైలెంట్గా ఉండడమే బెటరని అంటున్నారు. మొత్తానికి అధినేత జగన్ తన వ్యాఖ్యల ద్వారా నేతలను అలర్ట్ చేసినట్టు కనిపిస్తోంది.