Naga Skull Auction Withdraw: నాగాలకు చెందిన మనిషి పుర్రెను వేలం వేయాలనే నిర్ణయాన్ని బ్రిటీష్ వేలం సంస్థ ది స్వాన్ వెనక్కు తీసుకుంది. ఈ వేలంపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో బ్యాక్ స్టెప్ వేసింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఈ పుర్రెకు వేలం నిర్వహించాలని సంస్ధ భావించింది. ఆన్ లైన్ వేదికగా వేలం పాటను మొదలుపెట్టింది. అయితే, ఈ వేలంపై భారత ఈశాన్య రాష్ట్రం నాగాలాంగ్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ఈ వేలాన్ని నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశీ వ్యవహారా మంత్రి జైశంకర్ కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీఫియు రియో లేఖ రాశారు. చనిపోయిన వారి అవశేషాలకు గౌరవం ఇవ్వడం నాగా జాతి ప్రజల సంప్రదాయం అని లేఖలో వివరించారు. “చనిపోయిన వ్యక్తి అవశేషాలు వారి కుటుంబ సభ్యులకు లేదంటే ఆ జాతి ప్రజలకు చెందినవిగా నాగాలాండ్ ప్రజలు భావిస్తారు. మానవ అవశేషాలను వేలం వేయడం ద్వారా నాగా ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. ఇది అమానవీయ చర్యగా భావిస్తున్నాం. వెంటనే ఈ వేలం విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోని, నిలిపి వేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం” అని రియో లేఖలో వెల్లడించారు.
జైశంకర్ ఎంట్రీతో వేలం నిలిపివేత
నాగాలాండ్ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా బ్రిటన్ వేలం సంస్థ వ్యవహరిస్తుందని పలువురు స్వచ్ఛంద సంస్థల సభ్యులు విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. ఆ రాష్ట్ర సామాన్య జనం నుంచి సైతం ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో జైశంకర్ స్పందించారు. ఈవేలం పాటను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని యుకెలోని భారత హైకమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఈ విషయాన్ని ఆయన బ్రిటన్ వేలం సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. భారత్ నుంచి వచ్చిన విజ్ఞప్తితో నిర్వాహకులు వెనక్కి తగ్గారు. భారత ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తున్నట్లు వెల్లడించారు. నాగా ప్రజల ఆచార, వ్యవహారాను హానర్ చేస్తూ వేలం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వెంటనే వేలం ప్రక్రియ నుంచి నాగా పుర్రెను తొలగించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం పట్ల నాగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బ్రిటీష్ మ్యూజియంలో 6,500 నాగా వస్తువులు
లండన్ ఆక్స్ ఫర్డ్ లోని పిట్స్ రివర్ మ్యూజియంలో ఉన్న ప్రాచీన నాగా మానవ అవశేషాలను స్వదేశానికి తీసుకురావడానికి నాగా సంఘం గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్నిస్తోంది. ఈ అవశేషాలు ఆంగ్లేయుల పాలనలో ఇండియా నుంచి బ్రిటన్ కు తరలించారు. ప్రస్తుతం నాగా జాతులకు సంబంధించి సుమారు 6,500 వస్తువులు అక్కడి మ్యూజియంలో ఉన్నాయి. తాజాగా జైశంకర్ కు నాగాలాండ్ సీఎం రియో రాసిన లేఖలో నాగా వస్తువులను స్వదేశానికి రప్పించే ప్రయత్నాల గురించి కూడా ప్రస్తావించారు. నాగా జాతి మానవ అవశేషాలను స్వదేశానికి తీసుకురావాల్సిన అవశ్యకత చాలా ఉందన్నారు. తమ ప్రజల మనోభావాలను గౌరవించి భారత ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని ముమ్మరం చేయాలని రిక్వెస్ట్ చేశారు.
Read Also: అబ్బాయిల కోసం ఎగబడుతున్న మేఘాలయ అమ్మాయిలు.. నిజంగా అంత కరువుతో ఉన్నారా?