హైదరాబాద్, స్వేచ్ఛ: కులగణనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా ఉన్న నేపథ్యంలో బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు బీసీ సంక్షేమ సంఘం నేతలు. తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: ఆదాయ మార్గాలపై ఫోకస్ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు నేతలు హాజరయ్యారు. అంతకుముందు, తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వేపై ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలపై చర్చించారు. బీసీ కమిషన్కు, రాష్ట్ర ప్రణాళిక విభాగానికి సమన్వయకర్తగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్కు తెలిపారు. 60 రోజుల్లోనే సామాజిక, ఆర్థిక సర్వే పూర్తి చేయాలని, డిసెంబర్ 9లోపే నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.