ED JD : ఈడీ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్గా రోహిత్ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహించిన దినేష్ పరుచూరి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కు పదోన్నతిపై కొచ్చి జోనల్ కార్యాలయానికి బదిలీ అయ్యారు.
హైదరాబాద్ జోన్ జేడీగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ ఆనంద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈడీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తారు. 2009 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన ఆయన డిప్యుటేషన్పై ఈడీలో చేరారు.
గతంలో రోహిత్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ శాఖలో పనిచేశారు. ఈ ఏడాది జూలై 31న ఈడీలో చేరారు. తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైదరాబాద్ జోన్ ఈడీ విచారణ జరుపుతున్న సమయంలో కొత్త అధికారి నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని తాజాగా విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. కానీ విచారణకు హాజరు కాలేనని రోహిత్ రెడ్డి ఈడీకి మెయిల్ చేశారు. ఈడీ విచారణకు గైర్హాజరుపై ఆయన వివరణ ఇచ్చారు. ఈడీ విచారణపై హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. బుధవారం తన పిటిషన్ విచారణకు వస్తుందని, అప్పుడు ఈడీ విచారణకు నేరుగా హాజరు కావాలన్నా వెళ్తానని స్పష్టంచేశారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ అధికారులు రోహిత్ రెడ్డిని విచారించారు. మరోసారి డిసెంబర్ 27న విచారణకు హాజరుకావాలని గతంలో ఆదేశించారు. ఈ క్రమంలో చివరి నిమిషంలో విచారణకు హాజరుకాలేనని రోహిత్ రెడ్డి మెయిల్ ద్వారా ఈడీకి సమాచారం ఇచ్చారు.
మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ను చంచల్ గూడా జైలులో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈడీ తెలంగాణలో పలు కేసులపై విచారణ చేస్తోంది. చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణను విచారించింది. ఆ తర్వాత గ్రానైట్ వ్యాపారులపై దాడులు చేసింది. మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇళ్లు ,కార్యాలయాల్లో సోదాలు జరిపింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ దర్యాప్తు సాగుతోంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై ఈడీ విచారణ సాగుతోంది. ఇలా ఏపీ, తెలంగాణకు సంబంధిచిన చాలా కేసుల్లో ఈడీ దర్యాప్తు సాగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ ఆనంద్..ఆయన పరిధిలోని కేసులకు ఎలాంటి ముగింపు ఇస్తారనే ఆసక్తి నెలకొంది.