YS Jagan On Mopidevi: వైసీపీ నుండి వలసల పర్వం.. మాజీ సీఎం పవన్ వైయస్ జగన్ కు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. అసలే ఎన్నికల ఫలితాల్లో 11 సీట్లు మాత్రమే దక్కగా.. కోలుకోలేని దెబ్బ పడింది వైసీపీకి. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీకి వలసలు షాకిస్తున్నాయి. ఇదే విషయంపై తాజాగా జగన్ చేసిన కామెంట్.. వైరల్ గా మారింది.
తాడేపల్లి లోని తన నివాసంలో మాజీ సీఎం జగన్ రేపల్లె నియోజకవర్గం వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, నియోజకవర్గంలోని స్థితిగతుల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. మంచివైపు దేవుడు తప్పకుండా ఉంటాడని, రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదన్నారు. తన తండ్రి సీఎం అయినా కూడా.. తనకు నాటి రోజుల్లో కష్టాలు తప్ప లేదని.. 16 నెలలు తప్పుడు కేసులతో జైలులో ఉన్నట్లు తెలిపారు. ఇలా జగన్ తన జైలు జీవితం గురించి తెలిపి, పార్టీ నాయకుల్లో ధైర్యమందించే ప్రయత్నం చేశారు. ఇదే సమావేశంలో పార్టీ వీడిన నేతల గురించి కామెంట్ చేశారు.
ఇటీవల మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ వైసీపీ వీడి టీడీపీ లో చేరారు. అంతేకాదు నెల్లూరు జిల్లా కు చెందిన మాజీ ఎంపీ బీద మస్తాన్ రావు కూడా వైసీపీని వీడారు. వీరిద్దరూ ఒకేసారి పార్టీ వీడి.. సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. అంతకుముందు ప్రకాశం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీ వీడి జనసేన పార్టీలో చేరారు. అలాగే ఒంగోలు నగరపాలక సంస్థ కూడా టిడిపి వశం కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ క్యాడర్ ను కాపాడుకునే పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది.
Also Read: Ys Jagan: నేను పలావు.. బాబు బిర్యానీ.. ప్రజలపై జగన్ కౌంటర్..
ఈ వలసల పై జగన్ స్పందిస్తూ.. తనను నమ్ముకున్న ఏ నాయకుడికి తాను మోసం చేయలేదని, మంచి చేసిన వారే నేడు పార్టీ వీడుతున్నట్లు తెలిపారు. మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడటం తనకు బాధాకరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న మోపిదేవి ని.. అసలు మండలి రద్దు విషయం వెలుగులోకి వచ్చిన సమయంలో.. రాజ్యసభకు పంపించడం జరిగిందన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల మోపిదేవికి ఎప్పుడు తాను తప్పు చేయలేదని.. అంతా మంచే చేశానన్నారు. ఒక దశలో మోపిదేవి గురించి మాట్లాడుతూ జగన్ భావోద్వేగానికి గురయ్యారు. మొత్తం మీద తాను నమ్మిన నేతలు.. తనను వదిలి పార్టీలు మారడంపై తొలిసారిగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు.