Rajendra Prasad:రాజేంద్రప్రసాద్ రీసెంట్గా నటించిన సినిమా శాసనసభ. ఈ సినిమా ప్రమోషన్లలో ఆయన రాజకీయాల గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ కామెంట్లు రాజేంద్రప్రసాద్ రాజకీయ ప్రస్థానం గురించే అనుకుంటే పొరపాటు పడ్డట్టే. రాజకీయాల గురించి ఆయన అభిప్రాయాలు మాత్రమే. రాజకీయాల్లోకి యువత రావాలన్నారు రాజేంద్రప్రసాద్. మరి ఆయన రారా? అంటే, నేనిప్పుడు సినిమాల్లో బిజీ కాబట్టి అసలు అలాంటి ఆలోచనే లేదంటారు. పోనీ, ఇండస్ట్రీలో మీ కొలీగ్స్ చాలా మంది రాజకీయాల్లోకి వెళ్లారు కదా, దాని గురించి మీ స్పందన ఏంటి? అని అడిగితే చెప్పీ చెప్పనట్టు చెబుతూనే, కొన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చేశారు.
రాజకీయాలనేవి తనకు పెద్దాయన ఎన్టీఆర్గారి నుంచే తెలుసని అన్నారు. ఆయన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా రాజకీయాల గురించి అవగాహన ఉందని అన్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లారని, ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా రాజకీయాల్లోనే ఉన్నారని, అయితే వారిద్దరూ ఎప్పుడూ ఆ విషయాలను తనతో మాట్లాడలేదని అన్నారు. అలాగే తారక్ రాజకీయాల్లోకి వస్తారో రారో ఎప్పుడూ తాను కనుక్కునే ప్రయత్నం చేయలేదని, దాని గురించి ఏం మాట్లాడినా అది తన ఒపీనియన్ అవుతుందే తప్ప తారక్ అభిప్రాయం అవదనీ అన్నారు.
అంతేకాదు, రోజా రాజకీయాల్లోకి వచ్చి మినిస్టర్ అయ్యారని, ఆమె కూడా ఎప్పుడూ తనతో రాజకీయాల గురించి మాట్లాడలేదని చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే మాటలు అప్పట్లో గట్టిగా వినిపించాయని, తర్వాత రావట్లేదనే విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారని కూడా గుర్తుచేశారు. దీనంతటినీ బట్టి రాజేంద్రప్రసాద్ సలహాలను మెగా కాంపౌండ్ రాజకీయాల విషయంలో తీసుకోలేదన్నమాట.