Ratan TATA : దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా తాజాగా అనారోగ్యంతో కన్నుమూశారు. ముంబైలోని బ్రీత్ క్యాండీ ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స అందుకుంటున్న రతన్ టాటా బుధవారం రాత్రి 11:30 గంటలకు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 86 ఏళ్లు. ఆయన ఇక లేరన్న విషయాన్ని సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులదాకా భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెలబ్రిటిలంతా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే రాజమౌళి, చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు తదితరులు సోషల్ మీడియా వేదికగా భారతీయులకు ఇది బాధాకరమైన రోజు అంటూ సంతాపం తెలియజేశారు. అంతేకాకుండా ఆయన నిజమైన పారిశ్రామికవేత్త, పరోపకారి అంటూ కొనియాడుతున్నారు. మంచి మనసున్న రతన్ టాటా భారతీయ పారిశ్రామికవేత్తలలో పెంపొందించిన విలువలు తర్వాత తరాలకు స్ఫూర్తినిస్తాయంటూ రతన్ టాటా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన గురించి ఎవరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో రతన్ టాటా నిర్మించిన సినిమా కూడా ఒకటి. మరి రతన్ టాటా నిర్మించిన ఆ సినిమా ఏంటి? ఎందుకు ఆయన ఒకే ఒక్క సినిమాను నిర్మించారు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
రతన్ టాటా ఒకే ఒక్క సినిమా
టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఇండియాలో ఒక సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త. అయితే ఆయన ఒకప్పుడు బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టాడన్న విషయం చాలామందికి తెలియదు. 2004లో ఆయన ‘ఏట్ బార్’ (Aetbaar) అనే సినిమాను నిర్మించాడు. ఆయన ఇప్పటిదాకా చేసిన ఏకైక సినిమా అదే. కానీ ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించగా, రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సినిమాలో అమితాబ్ బచ్చన్, బిపాసా బసు, జాన్ అబ్రహం వంటి స్టార్స్ నటించారు. అయితే ఇంతటి పేరున్న నటీనటులు సినిమాలో నటించినప్పటికీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అమితాబ్ ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను పోషించగా, బిపాసా, జాన్ అబ్రహం లవర్స్ గా నటించారు. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రతన్ టాటా. కానీ ప్రేక్షకులను సినిమా ఏ మాత్రం మెప్పించలేకపోయింది.
దారుణమైన కలెక్షన్స్…
కాగా ఈ సినిమాను అప్పట్లోనే దాదాపు 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కినప్పటికీ సినిమా ఇండియాలో కేవలం 4.25 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ఏడుపాయలు 96 కోట్లు మాత్రమే సాధించగలిగింది. మొత్తానికి రతన్ టాటా నిర్మించిన సినిమా భారీ డిజాస్టర్ అయ్యి, మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది. దీంతో ఆయన చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. నిజానికి రతన్ టాటా బాలీవుడ్లోకి అడుగుపెట్టడం అన్నది ఊహించనిది. వ్యాపార రంగంలో సక్సెస్ ఫుల్ అయిన ఆయన సినిమా నిర్మాణంలో కూడా సక్సెస్ ఫుల్ అవ్వాలని ఆలోచించారు.. కానీ దురదృష్టవశాత్తు ఆయనకు సినిమా రంగం కలిసి రాలేదు. ఇలా ‘ఏట్ బార్’ సినిమా ప్లాప్ తర్వాత మళ్లీ సినిమా పరిశ్రమ వైపు కనెత్తి చూడలేదు.