Jagan : ఏపీ ప్రభుత్వం పెన్షన్ల తొలగిస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పింఛన్ల తొలగింపుపై క్లారిటీ ఇచ్చారు.
అర్హత ఉన్నా ఇంకా లబ్ధి పొందని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అలాంటి లబ్ధిదారులు 2,79,065 మందిని గుర్తించింది. వారికి రూ. 590.91 కోట్లను సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. జగనన్న చేదోడు, వైఎస్సార్ మత్స్యకార భరోసా, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి, వైఎస్సార్ కాపునేస్తం సహా పలు పథకాల లబ్ధిదారులకు తాజాగా నిధులు జమ చేశారు. పెన్షన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ జరగాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వచ్చే ఆరోపణలను పాజిటివ్గా తీసుకుందామని కలెక్టర్లకు సూచించారు. ఆరోపణల్లో నిజం ఉంటే సరిచేసుకుందామని సూచించారు.
పెన్షన్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఆడిట్ జరుగుతుంటే పెన్షన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్ మాత్రమే చేస్తామని తెలిపారు. అర్హులందరికీ పెన్షన్లు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తప్పుడు ప్రచారాన్ని కలెక్టర్లు తిప్పికొట్టాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో పెన్షన్ బిల్లు నెలకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఉండేదని ఇప్పుడు పెన్షన్ బిల్లు రూ.1770 కోట్లు అని వెల్లడించారు. గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారని ఇప్పుడు 62 లక్షల మందికి ఇస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో పెన్షన్ రూ.వెయ్యి మాత్రమే ఇచ్చేవారని ఇప్పుడు రూ.2750కి పెంచామన్నారు. మనం విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని విష ప్రచారం చేసే వారిని దేవుడే శిక్షిస్తాడని సీఎం జగన్ అన్నారు.
తమది రైతులు, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని.. ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. మూడున్నరేళ్లలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.85 లక్షల కోట్లు జమ చేశామని తెలిపారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తం రూ.3.30 లక్షల కోట్లు అందించామన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయని సీఎం జగన్ ఆరోపించారు.
మొత్తంమీద ప్రతిపక్షాల విమర్శలకు జగన్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. పెన్షన్లు తొలగించడం లేదని స్పష్టత నిచ్చారు. అయితే 300 యూనిట్లు కరెంట్ బిల్లు వచ్చినవారిని అనర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పెన్షన్ తొలగింపు వివాదం రాజుకుంది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్నవారికి పెన్షన్లు తొలగించడంలేదని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. అదే విషయాన్ని మరోసారి సీఎం జగన్ స్పష్టం చేశారు.