Ratan Tata Death| దేశంలోనే దిగ్గజ బిజినెస్ మెన్, టాటా గ్రూప్ గౌరవ చైర్మెన్ రతన్ టాటా కన్నుమూశారు. 86 ఏళ్ల రతన్ టాటా ఇటీవల అనారోగ్యం కారణంగా ముంబై నగరంలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బిజినెస్ మెన్ అయినప్పటికీ ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. రెండు రోజుల క్రితం కూడా ఆయన చనిపోయినట్లు వార్త రాగానే తాను క్షేమంగా ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశారు.
టాటా సన్స్ గౌరవ చైర్మెన్ అయిన రతన్ టాటా పూర్తి పేరు రతన్ నావల్ టాటా. 1937 సంవత్సరంలో డిసెంబర్ 28న నావల్ టాటా, సోనీ కామిసారిట్ అనే పార్సీ దంపతులకు ఆయన జన్మించారు. రెండేళ్ల తరువాత రతన్ టాటా తమ్ముడు జిమ్మీ టాటా జన్మించారు. రతన్ టాటా పదేళ్ల వయసున్నప్పుడే ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తరువాత కొంత కాలం జెయన్ పెటిట్ అనాథాలయంలో ఉన్నారు. అది తెలిసి రతన్ టాటా నాన్మమ్మ నవాజ్ బాయి టాటా ఆయనను చట్టపరంగా దత్తత తీసుకున్నారు.
కొంత కాలం తరువాత ఆయన తండ్రి నావల్ టాటా సిమోన్ అనే యువతిని రెండో వివాహం చేసుకన్నారు. వారిద్దరికీ నోయెల్ టాటా అనే కుమారుడు జన్మించాడు. రతన్ టాటా బాధ్యతలు తిరిగి ఆయన తండ్రి తీసుకున్నారు. అలా రతన్ టాటా టీనేజ్ అంతా తన సవతి తల్లి సిమోన్ టాటా, తమ్ముడు నోయెల్ టాటాతో గడిచింది.
Also Read: బ్రహ్మచారిగా జీవించిన రతన్ టాటా.. ఆయన ప్రియురాలు ఎవరో తెలుసా?..
రతన్ టాటా ముంబైలోని కాంపియోన్ స్కూల్ లో 8వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత క్యాథెడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ లో కొంత కాలం, ఆ తరువాత హిమాచల్ ప్రదశ్ షిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్ లో కొంతకాలం స్కూల్ విద్య పూర్తి చేశారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీ లోని రివర్ డేల్ కంట్రీ స్కూల్ నుంచి 1955లో ఆయన డిగ్రీ పూర్తిచేశారు. ఆ తరువాత 1959లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్స్ కోర్సు చదువుకున్నారు.
రతన్ టాటా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించిన గొప్ప వ్యక్తి. ఆయనలో పెద్ద పారిశ్రామికవేత్తతో పాటు.. గొప్ప మానవీయగుణం ఉంది. 2008లో రతన్ టాటా తాను చదువుకున్న కార్నెల్ యూనివర్సిటీ 50 మిలియన్ డాలర్ల విరాళం అందించారు. రతన్ టాటా హయాంలోనే టాటా గ్రూప్ కంపెనీలు పలు కీలక రంగాల్లో అద్భుత అభివృద్ధిని సాధించాయి.
ఈ రోజు టాటా గ్రూప్ టీ పౌడర్ నుంచి జాగుఆర్, ల్యాండ్ రోవర్ లాంటి పెద్ద పెద్ద కార్లు సైకం విక్రయిస్తోంది. సముద్రంలో నుంచి ఉప్పు తయారు చేయడంతో పాటు అదే సముద్రంలో ప్రయాణించే పెద్ద పెద్ద షిప్పులు, విమానాల తయారీకి పేరు గాంచింది. ఎన్నో రంగాల్లో టాటా కంపెనీలు విజయవంతంగా రాణిస్తున్నాయి అంటే దానికి ప్రధాన కారణం రతన్ టాటానే.
ఎంతో మందికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా ఒక మాట చెప్పేవారు. ”ధనాన్ని, బలాన్ని నేను నమ్ముకోలేదు.. కేవలం ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నాను. సరైన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి అని నేను చెప్పను. ముందు ఒక నిర్ణయం తీసుకొని.. ఆ తరువాత దాన్ని సరిగా అమలుపరుస్తాను.” అని చెప్పేవారు. దేశాభివృద్ధికి పాటుపడిన రతన్ టాటాకు 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రదానం చేసింది. ఆ తరువాత 2008లో దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సన్మానించింది.
రతన్ టాటా మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేస్తూ.. ఆయన ఎంతో దయగల అసాధారణ వ్యక్తి అని ఎంతో దూరదృష్టి గల వ్యాపారవేత్త అని కొన్నియాడారు.