Delhi CM’s Residence Sealed: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అధికారులు షాకిచ్చారు. ఆమె అధికారిక నివాసానికి సీల్ వేశారు. అంతకు ముందు ఆ నివాసం నుంచి ముఖ్యమంత్రి సామాన్లను బయటకు తరలించారు. ఢిల్లీ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉంటుంది. అందులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉండేవారు. ఆయన తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ నివాసాన్ని ఖాళీ చేశారు. అదే నివాసంలోకి ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె నివాసాన్ని పీడబ్ల్యుడీ అధికారులు ఖాళీ చేసి సీల్ వేశారు. అక్రమంగా ఈ నివాసాన్ని ఆమె ఆక్రమించినందునే ఈ ఖాళీ చేయించినట్లు తెలిపారు. సీఎం సమాన్లను ఇతర వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Visuals from outside the residence of Delhi Chief Minister, 6-flag Staff Road, Civil Lines.
A team of PWD officials has reached here. Delhi CMO claims that Delhi LG got all the belongings of Chief Minister Atishi removed from the Chief Minister’s residence. pic.twitter.com/L3ukGlWYLk
— ANI (@ANI) October 9, 2024
బీజేపీ చెప్పినట్లే గవర్నర్ ఆడుతున్నారు- ఢిల్లీ సీఎంఓ
అటు ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని అధికారులు ఖాళీ చేయించడంపై ఢిల్లీ సీఎం కార్యాలయం స్పందించింది. సీఎం నివాసం నుంచి అతిషి లగేజీని వాహనాల్లో తరలించే వీడియోను షేర్ చేస్తూ, గవర్నర్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. “దేశ చరిత్రలోనే తొలిసారి ఓ సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించారు. బీజేపీ సూచనల ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ విజయ్ కుమార్ భవనాన్ని ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. మరుక్షణమే పీడబ్ల్యూడీ అధికారులు రంగంలోకి దిగి నివాసాన్ని ఖాళీ చేయించారు” అని వెల్లడించింది.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్
అటు ఢిల్లీ సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం దురాక్రమణకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడింది. ఆ నివాసాన్ని మాజీ సీఎం కేజ్రీవాల్ ఖాళీ చేసినా, బీజేపీ అబద్దపు ప్రచారాలతో అనవసర రాద్దాంతం చేస్తుందని ఆప్ ఆరోపించింది.
ఆప్ ఆ పత్రాలు సమర్పిస్తే సరిపోయేదన్న బీజేపీ
అటు ఢిల్లీ సీఎం అధికారిక నివాసానికి సంబంధించి పీడబ్ల్యూడీ అధికారులకు సరైన డాక్యుమెంట్స్ అందించి ఉంటే అసలు ఈ సమస్యే వచ్చేది కాదని ఢిల్లీ అసెంబ్లీలో విపక్ష నాయకుడు(బీజేపీ) విజయేందర్ గుప్తా చెప్పారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ షీష్ మహల్ కు ఎట్టకేలాకు సీల్ పడిందన్నారు. ఆయా శాఖల అనుమతి లేకుండా, తాళాలు తిరిగి ఇవ్వకుండా, మళ్లీ బంగళాలోకి అడుగు పెట్టేందుకు ఆప్ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇంతకీ ఆ బంగళాలో ఏమైనా రసహ్యాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. అటు ఢిల్లీ సీఎం అధికారిక నివాసం ఖాళీ చేయడానికి సంబంధించి ఎల్జీ కార్యాలయం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.