world mental health day: మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యమూ అంతే ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మందికి పైగా మానసిక రుగ్మతలతో జీవిస్తుండగా, ప్రతి అయిదుగురు పిల్లలలో ఒకరు మానసిక రుగ్మతల బాధితులుగా ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చాపకింద నీరులా విస్తరిస్తున్న మానసిక అనారోగ్య సమస్యల విపత్తును ‘కనిపించని సంక్షోభం’(హిడెన్ఎమర్జెన్సీ)గా అభివర్ణించింది. ఈ పరిస్థితులను గుర్తించిన వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ సంస్థ 1992 నుంచీ ఏటా అక్టోబర్ 10వ తేదీని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుతోంది. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ మానసిక ఆరోగ్యం మీద అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది.
ఇక.. పాశ్చాత్య దేశాలతో పోల్చితే, మన దేశంలో మానసిక సమస్యలను ఒక అనారోగ్యంగా గుర్తించే ధోరణి లేదు. ఈ సమస్యలున్న ప్రతి 100 మందిలో 90 మందికి తమకు ఆ సమస్య ఉన్నట్లే తెలియకపోవటం విచారకరం. పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వారు 2018లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, ప్రపంచ దేశాలలో అత్యధిక మానసిక సమస్యలున్న వారు భారత్లోనే అధికంగా ఉన్నట్లు తేలింది. మనదేశంలో మానసిక సమస్యలున్న వారిలో సగం మంది పాతికేళ్లలోపు వారే కాగా, నానాటికీ ఆందోళన, కుంగుబాటు, తెలియని భయాలతో సతమతమవుతున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోందని ఆ సర్వే నిర్ధారించింది. మనదేశంలో మానసిక ఆరోగ్యం కోసం చేసే కేటాయింపులు సైతం ఒకశాతం కంటే తక్కువ ఉన్నాయి. అమెరికా వంటి దేశాలలో 10 లక్షల మందికి 100 మంది సైకియాట్రిస్ట్లు, 300 మంది సైకాలజిస్టులు అందుబాటులో ఉండగా, మనదేశంలో పది లక్షలమందికి నలుగురు సైకియాట్రిస్ట్లే ఉన్నారు. ఇక.. దేశంలో అర్హతగల సైకాలజిస్టుల సంఖ్య బహుస్వల్పంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్- ఆరోగ్య, స్వాస్థ్య కేంద్రాల (ఏబీ-హెచ్డబ్ల్యూసీ)ను విరివిగా ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా ప్రాథమిక స్థాయిలోనే టెలీ కౌన్సెలింగ్ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ వ్యక్తుల సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతారు. ఈ సేవల కోసం 14416 లేదా 18008914416కు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు.
Also Read: కొబ్బరి నీరు తాగుతున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
చాలామందిలో బాల్యం లేదా కౌమార దశలో మానసిక సమస్యలు మొదలవుతున్నాయి. అయితే, వీటిలో 90 శాతం వెలుగులోకే రావటం లేదు. జీవ రసాయనాల తేడా, మెదడులో సహజంగా ఉత్పత్తి అయ్యే రసాయనిక పదార్థాల హెచ్చుతగ్గులు ఈ సమస్యకు ప్రధానకారణాలు. మెదడు ఇన్ఫెక్షన్స్, తలకు తగిలే దెబ్బలు, మూర్ఛ, మెదడులో రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం, బుద్ధి మాంద్యం, డిమెన్షియా, భావోద్వేగ సమస్యలు క్రమంగా తీవ్ర మానసిక రుగ్మతలుగా మారుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి, జన్యువులకు మధ్య బలమైన సంబంధం ఉందని ఇటీవలి పరిశోధనలు నిర్ధారించాయి. శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు, ఆల్కహాల్, డ్రగ్స్ వినియోగం, బాల్యంలో హింసకు, నిర్లక్ష్యానికి గురవడం, పిల్లల పెంపకంలోని లోపాలు, గృహ హింస, సంతానలేమి సమస్యలు, విడాకులు వంటి కారణాల వల్ల మానసిక సమస్యలు దేశంలో వేగంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు పరిమితంగానైనా మంచి మానసిక వైద్యం అందుబాటులో ఉన్నందున, అపోహలు వీడి ఈ సమస్యకు తగిన చికిత్స పొందే అవకాశం ఉంది. ఈ ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా మనం ఈ అంశంపై మనవంతుగా అవగాహన కల్పించాల్సిన అవసరముంది.
– డా. ఎన్.వీ రాయుడు