హైదరాబాద్, స్వేచ్ఛ: గాంధీ భవన్లో ప్రతి బుధవారం, శుక్రవారం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్కు వచ్చిన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అధికారులకు అప్లికేషన్ల అందజేత
సమస్యల పరిష్కారం కోసం వస్తున్న బాధితులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు పొన్నం ప్రభాకర్. బుధవారం కలెక్టర్ అప్లికేషన్లు 22 రాగా, రవాణా శాఖకు 42, వివిధ మంత్రులకు 115 వచ్చాయి. మొత్తం 179 అర్జీలు రాగా, వాటన్నింటినీ సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Also Read: రాష్ట్రంలో ఈసారి బతుకమ్మ పండుగ జరుగుతున్నట్టే లేదు: కేటీఆర్
కేటీఆర్కు కౌంటర్
గాంధీ భవన్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు పొన్నం. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అనుమతితో బీసీ కులగణనపై ఏజెన్సీ ఏర్పాటు, కార్యాచరణపై ముందుకు వెళ్తామన్నారు. కులగణన బీసీ కమిషన్, బీసీ సంక్షేమ శాఖ సారథ్యంలో జరుగుతుందని స్పష్టం చేశారు. మూసీ రివర్ బెడ్లో ఉన్న ప్రజలు ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు తీసుకుని దసరా సంతోషంగా జరుపుకోవాలని కోరారు. రీహాబిటేషన్ లేకుండా మూసీ పరిధిలోని నిర్మాణాలను ప్రభుత్వం కూల్చదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పడేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని నిలదీశారు. తాము చిత్తశుద్దితో ఉద్యోగాల భర్తీ చేస్తున్నామన్నారు. విద్యార్ధి, నిరుద్యోగులు తమ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని, విదేశీ విద్యానిధి గత ప్రభుత్వంలో 150 మందికి ఇస్తే, తాము 500 మందికి ఇస్తున్నట్టు వివరించారు.
దసరా నేపథ్యంలో ముఖాముఖి వాయిదా
దసరా పండుగ సెలవుల కారణంగా శుక్రవారం జరగాల్సిన ముఖాముఖి వాయిదా పడింది. మంత్రులతో ముఖాముఖి మళ్ళీ వచ్చే బుధవారం జరుగుతుంది. కావున, ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్పుడు వచ్చి విజ్ఞప్తులు ఇవ్వవలసిందిగా టీపీసీసీ కోరింది.