Rajinikanth -Mani Ratnam: కొన్ని సినిమాలు, కొన్ని కాంబినేషన్స్.. ఎప్పటికీ ఎవర్గ్రీన్గా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో ఒకటి మణిరత్నం, రజినీకాంత్. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి 33 ఏళ్లు అయిపోయింది. కానీ ఇప్పటికీ ఈ కాంబోకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది అనే వార్త కోలీవుడ్లో తెగ వైరల్ అవుతోంది. మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్కు కాల్ షీట్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నా.. ఆయన కొంతకాలంగా యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మణిరత్నం దృష్టి కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలపై పడింది.
ఫ్యాన్స్ హ్యాపీ
మణిరత్నం, రజినీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమానే ‘దళపతి’. అప్పటినుండి ఇప్పటివరకు వీరి కాంబోలో మరో మూవీ రాలేదు. కానీ ‘దళపతి’ మూవీ మాత్రం క్లాసిక్ హిట్గా నిలిచిపోయింది. అంతే కాకుండా ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలను ఇష్టంగా వింటున్నవారు ఉన్నారు. అందుకే మణిరత్నం, రజినీకాంత్, ఇళయరాజా కాంబినేషన్ను మించే కాంబో లేదని అంటుంటారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మారినా కూడా మణిరత్నం, రజినీకాంత్ కలిసి సినిమా చేయడం పక్కా అని తమిళ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త మ్యూచువల్ ఫ్యాన్స్ను హ్యాపీ చేస్తోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా కూడా మారింది.
Also Read: రజినీకాంత్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘వేట్టయాన్’ స్పెషల్ స్క్రీనింగ్స్కు గ్రీన్ సిగ్నల్
అప్పటినుండే వార్తలు
2022లో ‘పొన్నియిన్ సెల్వన్’ లాంటి భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాతో రిస్క్ తీసుకున్నారు మణిరత్నం. ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలుగా విడుదల కాగా ఆ రెండు యావరేజ్గానే నిలిచాయి. అదే సమయంలో ఈ సినిమా తర్వాత మణిరత్నం.. ఎవరితో మూవీ చేస్తారు అనే విషయం ప్రేక్షకులు చర్చించడం మొదలుపెట్టారు. అప్పుడే ఆయన రజినీతో మూవీ చేసే అవకాశాలు ఎక్కువ అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అప్పటినుండి ఇప్పటివరకు ఈ కాంబినేషన్పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇంతలోనే కమల్ హాసన్తో ‘థగ్ లైఫ్’ అనే మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు మణిరత్నం. తాజాగా ఈ సినిమా పూర్తవ్వడంతో మరోసారి రజినీకాంత్తో మణిరత్నం సినిమా గురించి మరోసారి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
అన్నీ సిద్ధం
ప్రస్తుతం ‘వేట్టయాన్’ మూవీ రిలీజ్, ప్రమోషన్స్ విషయంలో బిజీగా ఉన్నారు రజినీకాంత్. ఇక ‘వేట్టయాన్’ తర్వాత ఆయన చేసే మూవీపై కూడా ఇంకా క్లారిటీ లేదు. అందుకే మణిరత్నం, రజినీకాంత్ కాంబినేషన్ ఫిక్స్ అని, డిసెంబర్లో రజినీ పుట్టినరోజు సందర్భంగా దీని గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్.. ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.. ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తారని తెలుస్తోంది. మొత్తానికి నిజంగానే మణిరత్నం, ఏఆర్ రెహమాన్, రజినీకాంత్ కాంబినేషన్ ఫిక్స్ అయితే కోలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా చాలా హ్యాపీ.