CM Revanth Reddy distributed Appointment letters to 11062 Teachers: కొత్తగా టీచర్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నియామక పత్రాలను అందజేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇస్తుంటే ఇంతకంటే ఆనందం మాకు మరొకటి ఉండబోదన్నారు. మిమ్మల్ని చూస్తే దసరా పండుగ మూడు రోజుల ముందే వచ్చిందా అని అనిపిస్తోందంటూ సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: విపత్తులు అరికట్టాలంటే తప్పదు.. అందరికీ న్యాయం చేస్తామన్న సీఎం రేవంత్
‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండుసార్లు కోరి కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నాం. నిరుద్యోగుల సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మీ కుటుంబ సభ్యులకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చుకున్నారు. కానీ, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏనాడైనా ఆలోచన చేశావా?. సాధించిన తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని గతంలో ఆశించారు. కానీ, గత ముఖ్యమంత్రి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం ఏనాడు చేయలేదు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఉద్యోగాలను ఊడగొట్టాలని ఆనాడే చెప్పాను. తండ్రీ కొడుకుల కొలువులు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తున్నాయి.
మా ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. 21 వేలమంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం. ఏదో రకంగా నోటిఫికేషన్లను అడ్డుకోవాలని కుట్రలు చేశారు. ఉద్యోగాలు ఇస్తుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ పదవులు ఇచ్చావు. కానీ, మా పిల్లల కోసం ఏనాడైనా నిరుద్యోగుల కోసం ఆలోచించావా.?
Also Read: తెలంగాణలో కొత్త టీచర్లకు నియామక పత్రాలు, సీఎం రేవంత్ న్యూరికార్డ్
అసెంబ్లీకి రావు.. సలహాలు, సూచనలు ఇవ్వవు. మంచి పనులు చేస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెట్టి అడ్డుకుంటున్నారు. తెలంగాణ సమాజం మీద మీకెందుకంత కోపం. ఇకపై తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడుతామని బాధ్యతలేకుండా మాట్లాడుతున్నారు.
నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. ప్రభుత్వ స్కూళ్లకు పంపడానికి కొందరు నామోషీగా ఫీలవుతున్నారు. పేదోళ్లు తాళిబొట్టు తాకట్టు పెట్టి ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. బడ్జెట్ లో విద్యారంగానికి రూ. 21 వేల కోట్లు కేటాయించాం. ప్రతీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి 25 నియోజకవర్గాల్లో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గత పదేళ్ల కాలంలో యువత గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగింది. త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. యువతను క్రీడలవైపు ప్రోత్సహించాలి. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా మంచి మంచి క్రీడాకారులను తయారు చేస్తాం. వచ్చే ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్ సాధించేలా శిక్షణ ఇస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: మెట్రో రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలు.. 5 కారిడార్లకు రూ.24,269 కోట్ల వ్యయం