Indrakeeladri Temple Arrangements: పవిత్ర నవరాత్రి ఉత్సవాలు, అందునా అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం.. బెజవాడ అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజున ఆలయ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. దసరాకు ముందు తొమ్మిది రోజులు అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. ఇలాంటి సమయంలో ఆలయ అలంకరణను గాలికి వదిలేశారు. తోరణాలు వాడిపోయి, బంతిపూలు మాడిపోయినా పట్టించుకోలేదు. కనీసం వాటిని మార్చాలనే సోయిలేకుండా పోయింది.
అధికారుల నిర్లక్ష్యంపై బిగ్ టీవీ వరుస కథనాలు
ఇందకీలాద్రి అమ్మవారి ఆలయ అలంకరణ విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. కనీసం తోరణాలు, పూల మాలలు మార్చే తీరకలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బిగ్ టీవీ కథనాలపై ఆలయన అధికారులు ఆగమేఘాల మీద స్పందించారు. వెంటనే ఆలయంలో ఉన్న వాడిపోయిన తోరణాలు, పూలమాలలను సిబ్బంది చేత తొలగించారు. వాటి స్థానంలో కొత్త మామిడి తోరణాలు, అరటి చెట్లు, పూల మాలలను ఏర్పాటు చేశారు. కొత్త అలంకరణతో ఆలయం సరికొత్త అందాన్ని సంతరించుకుంది.
అధికారుల తీరుపై ఆగ్రహం, బిగ్ టీవీపై ప్రశంసలు
అమ్మవారికి ఇష్టమైన నవరాత్రి ఉత్సవాల వేళ అధికారులు పట్టనట్లు వ్యవహరించడం పట్ల భక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి అలంకరణను కనీసం పట్టించుకునే పరిస్థితిలో అధికారులు లేరా? అంటూ మండిపడ్డారు. నవరాత్రి ఉత్సవాల వేళ ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన బిగ్ టీవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వార్తలు చూసైనా ఇక ముందుకు అమ్మవారి అలంకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
బెజవాడ అమ్మవారిని దర్శించుకున్న సీఎం, డిప్యూటీ సీఎం
పవిత్ర మూలా నక్షత్రం రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడ దర్గమ్మను దర్శించుకున్నారు. చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ పండితులు వారికి సాదరస్వాగతం పలికి వేద ఆశీర్వాదాలు అందించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఇచ్చి సత్కరించారు.
మూలానక్షత్రం రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం గా భావిస్తున్నట్లు బాబు చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా చేసుకుంటామన్న ఆయన.. తిరుమల తర్వాత రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవాలయం అయిన ఇంద్రకీలాద్రి పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అటు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనక దుర్గమ్మ వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన కూతురు ఆధ్య దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Read Also: ఇంద్రకీలాద్రిలో ఈసారి ఇది ఏర్పాటు చేశాం.. ఇక భక్తులకు ఎలాంటి ఆందోళన అవసరంలేదు: చంద్రబాబు
Read Also: తిరు వీధుల్లో భక్త ప్రవాహం.. దర్శనానికి ఎన్ని గంటలంటే?