Drugs Sale on Road| దేశంలో మాదక ద్రవ్యాల బిజినెస్ రోజురోజుకీ పెరిగిపోతోంది. పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా.. డ్రగ్స్ ముఠాలు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి. నడిరోడ్డుపైనే బహిరంగంగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు ఒక జాతీయ మీడియా ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ తో తేలింది.
అక్టోబర్ 6, 2024న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో ప్రముఖ జాతీయ మీడియా ఛానెల ఎన్డీటీవి ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఇందులో ఇద్దరు ఎన్డీటీవి రిపోర్టర్లు డ్రగ్స్ కావాలని కస్టమర్లుగా పోజులిస్తూ నగరంలో తిరిగారు. ఈ స్టింగ్ ఆపరేషన్ షాకింగ్ విషయాలు తెలిశాయి. నగరంలోని ఇట్వారా, బుధ్వారా లాంటి బిజీ ప్రాంతాలు, బిట్టెన్ మార్కెట్, 74 బంగ్లాస్ లాంటి హై ఫై ప్రాంతాలు.. ఇలా అన్ని ప్రాంతాల్లో బహిరంగంగానే డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసింది.
అయితే ఏ ఏ ప్రాంతాల్లో డ్రగ్స్ దొరుకుతాయని ఇద్దరు ఎన్డీటీవి రిపోర్టర్లు కాలేజీ విద్యార్థులు, వీధి వ్యాపారులతో డ్రగ్స్ కస్టమర్ల రూపంలో ప్రశ్నించారు. వారంతా డ్రగ్స్ ఎక్కడ లభిస్తాయో అందరికీ తెలుసునని.. చెబుతూ.. ఇట్వారా, బుధ్వారా ప్రాంతాల్లో లొకేషన్ గురించి చెప్పారు. ఈ సమాచారం అందరికీ తెలిసి ఉంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు.
ఆ తరువాత ఇద్దరు రిపోర్టర్లు డ్రగ్ డీలర్లను స్వయంగా పట్టుకోవాలని ఒక ప్లాన్ ప్రకారం వెళ్లారు. బుధ్వారా ప్రాంతంలో పోలీస్ అవుట్ పోస్ట్ కు సమీపంలోనే డ్రగ్ డీలర్లు వారితో కలిశారు. అక్కడ ఒక డీలర్ వారికి చరస్ డ్రగ్స్ ప్యాకెట్లు ఇచ్చాడు. ఇది చూసి వారిద్దరూ ఆశ్చర్యపోయారు. పోలీస్ అవుట్ పోస్ట్ పక్కనే కూర్చొని డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. ఆ తరువాత నగరమంతా పలు చోట్ల ఆ ఇద్దరు రిపోర్టర్లు డ్రగ్ పెడర్ల నుంచి హాష్, మరిజువానా, బ్రౌన్ షుగర్, యండియంఏ లాంటి డ్రగ్స్ ప్యాకెట్ల రూపంలో తీసుకున్నారు. ఇదంతా వీడియో రహస్యంగా రికార్డింగ్ చేశారు.
Also Read: గుండె పోటు, పక్షవాతం రాకుండా కాపాడే ఫుడ్స్ ఇవే..
74 బంగ్లాస్, బిట్టన్ మార్కెట్ ప్రాంతాల్లో అయితే టీ స్టాల్ ఓనర్లు, కొబ్బరి బోండాలు విక్రయించే వాళ్లే డ్రగ్స్ అమ్ముతున్నట్లు స్టింగ్ ఆపరేషన్ లో తేలింది. ఆ డ్రగ్ పెడ్లర్లతో మాట్లాడుతూ నగరంలో సాహూజీ పేరుతో ఒక డాన్ ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.
ఇటీవల మధ్యప్రదేశ్ లో డ్రగ్స్ దందా విపరీతంగా పెరిగిపోయాయని, ప్రభుత్వం సరైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీలు నిలదీశాయి. దీంతో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి డ్రగ్స్ నేరస్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో కొన్ని వారాల క్రితం గుజరాత్ రాష్ట్రంలో నార్కోటిక్స్ బ్యూరో, యాంటి టెర్రరిజం స్వాడ్ అధికారులు 907 కేజీల మెఫెడ్రోన్ డ్రగ్స్(యండి) స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ మోతాదు డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.1814 కోట్లు ఉంటుందని అంచనా. ఈ డ్రగ్స్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు. ప్రతిరోజు ఈ ఫ్యాక్టరీలో 25 కేజీల యండి డ్రగ్స్ తయారీ జరుగోతందని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో అమిత్ చతుర్వేదీ, సాన్యాల్ బానె అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.