Israel Age Reverse Scam| మనుషులందరూ యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు. ఇది ఒక రకమైన బలహీనత. ఈ బలహీనతను ఆసరాగా తీసుకొని ఒక భార్యభర్తల జోడీ కోట్లు సంపాదించింది. వారు ఇదంతా నిజంగా జరుగుతుందని అంతగా ప్రజలను నమ్మించారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలను తమ టార్గెట్ గా చేసుకున్నారు. ఒక టైమ్ మెషీన్ ద్వారా ఇది సాధ్యమని చూపించారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరానికి చెందిన రాజీవ్ కుమార్ దూబే, అతని భార్య రష్మి దూబే కొన్నేళ్ల క్రితం వరకు ఒక మసాజ్ సెంటర్ నడిపారు. అయితే వారిద్దరూ తొందరగా కోటీశ్వరులు అయిపోదామని ఒక పథకం వేశారు. మసాజ్ సెంటర్ మూసేసి రివైవల్ వరల్డ్ పేరుతో కాన్పూర్ లో ఒక థెరపీ సెంటర్ ప్రారంభించారు. ఇజ్రాయెల్ నుంచి ఒక టైమ్ మెషీన్ తెప్పించామని తమ కస్టమర్లకు చెప్పారు. ఆ టైమ్ మెషీన్ లో ఆక్సిజన్ థెరపీ ద్వారా ఏజ్ రివర్స్ ప్రక్రియ ద్వారా వృద్ధులను సైతం యువకులుగా మార్చగలమని నమ్మించారు.
Also Read: వ్యభిచారానికి మారుపేరుగా టెంపరరీ పెళ్లిళు.. ఇండోనేషియాలో కొత్త బిబినెస్
వాతావరణంలో కాలుష్యం ద్వారా ప్రజలు త్వరగా ముసలివాళ్లుగా మారిపోతున్నారని కొన్ని వందల సంవత్సరాల క్రితం మనుషులు 200 నుంచి 300 సంవత్సరాలు బతికేవారని కల్లిబొల్లి కారణాలు చెప్పి ఆక్సిజన్ థెరపీ ద్వారా ఈ కాలుష్య ప్రభావం తగ్గించి క్రమంగా యవ్వనం తిరిగి తీసుకురాగలమని చెప్పారు. పైగా అందరికీ అందుబాటులో ఉండేలా మూడు సంవత్సరాల పాటు కోర్సు తీసుకుంటే రూ.90000 రివార్డు దక్కుతుంది, ఒకసారి థెరపీ తీసుకుంటే రూ.6000 అవుతుందని ధరలు నిర్ణయించారు.
ఆక్సిజన్ థెరపీ, ఇజ్రాయెల్ టెక్నాలజీ మెషీన్, ధరలు కూడా అందుబాటులో ఉండే సరికి గత రెండు మూడు సంవత్సరాలుగా వందల సంఖ్యలో ప్రజలు ఈ పథకంలో చేరారు. పైగా మూడేళ్ల కోర్సు పూర్తి చేసి వయసు తగ్గించుకున్న వారికి రివార్డులు కూడా ఉంటాయని ఈ మోసగాళ్ల జోడి ప్రకటించింది. అయితే రేణు సింగ్ అనే ఒక మహిళా కస్టమర్ గత 15 నెలలుగా రోజూ ఆక్సిజన్ తీసకుంటున్నా తనలో ఏ మార్పు రాలేదని గమనించి తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని చెప్పింది. కానీ రాజీవ్ కుమార్ ఒకసారి డబ్బులు చెల్లిస్తే తిరిగి ఇచ్చేది లేదని సమాధానం ఇచ్చాడు. రేణు సింగ్ అప్పటికే రూ.10.75 లక్షలు ఖర్చు పెట్టి రోజూ ఆక్సిజన్ థెరపీ తీసుకుంది. అంత ఖర్చు చేశాక తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు రేణు సింగ్ ఫిర్యాదుపై విచారణ మొదలుపెట్టారు. అయితే ఆ సమయంలో రాజీవ్ కుమార్ తన భార్యతో కలసి దుబాయ్ వెళ్లాడని తెలిసింది. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న రాజీవ్ కుమార్ దుబాయ్ నుంచి ఇంతవరకు తిరిగి రాలేదు. దీంతో పోలీసులు రాజీవ్ కుమార్, అతని భార్య గురించి సమాచారం సేకరించారు. వారిద్దరూ ఇప్పటివరకు ఆక్సిజన్ థెరపీ పేరుతో కస్టమర్ల నుంచి రూ.35 కోట్లు వసూలు చేశారని తేలింది. పోలీసులు రాజీవ్ కుమార్ దూబే, అతని భార్య రష్మి దూబేపై ఫ్రాడ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలిసింది.