Netanyahu Warns Lebanon| ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంబజమిన్ నెతన్యాహు లెబనాన్ ప్రజలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాలస్తీనా ప్రజలు గాజాలో అనుభవిస్తున్న నరకాన్ని లెబనాన్ వాసులు కూడా అనుభవిస్తారని.. అలా జరగకుండా ఉండాలంటే లెబనాన్ ప్రజలు హిజ్బుల్లాకు మద్దుతు ఇవ్వకూడదని అన్నారు.
మంగళవారం ప్రధాన మంత్రి నెతన్యాహు లెబనాన్ ప్రజలనుద్దేశించి ఒక వీడియో మెసేజ్ పంపారు. ”లెబనాన్ లో జరుగుతున్న పోరాటం ఒక సుదీర్ఘ యుద్ధంగా మారకముందే మీ దేశాన్ని కాపాడుకునేందకు ఒక అవకాశం ఇస్తున్నాను. గాజాలో జరిగిన వినాశనం లెబనాన్ లో జరగకూడదంటే హిజ్బుల్లాను సపోర్ట్ చేయడం మానేసి మీ దేశానికి హిజ్బుల్లా నుంచి విముక్తి చేయండి. అప్పుడే ఈ యుద్ధం ఆగుతుంది. మీరందరూ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. హిజ్బుల్లాతో కలిసి ఉండాలా? లేదా మీ దేశాన్ని కాపాడుకోవాలా?. మీరు వెంటనే నిర్ణయం తీసుకోకపోతే.. హిజ్బుల్లా మిలిటెంట్లు జనావాసాల్లో దాగి దాడులు చేస్తారు. అప్పుడు ఇజ్రాయెల్ దాడుల్లో పౌరులు మరణించే అవకాశం ఉంది. ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది” అని హెచ్చరించారు.
ఇజ్రాయెల్ పై ఆగని హిజ్బుల్లా దాడులు
మంగళవారం హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంపై భారీ సంఖ్యలో క్షిపణి దాడులు చేశారు. ఈ కారణంగా లెబనాన్ సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ వాసులు వేల సంఖ్యలో తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చింది. మరోవైపు ఇజ్రాయెల్ సైనికులు దక్షిణ లెబనాన్ లో ప్రవేశించి హిజ్బుల్లా మిలిటెంట్లతో పోరాడుతున్నారు. ఈ దాడుల్లో ఒక సీనియర్ హిజ్బుల్లా కమాండర్ చనిపోయాడని సమాచారం.
లెబనాన్ సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ భూభాగంపై హిజ్బుల్లా క్షిపణి దాడులు చేయడంతో హైఫా నగరంలోని ప్రజలు తమ ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నగరంలోని అన్ని స్కూళ్లు, దుకాణాలు మూసివేయబడ్డాయి. సరిహద్దు నగరాల్లో హిజ్బుల్లా 180 రాకెట్ దాడులు చేసిందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు తెలిపారు.
హిజ్బుల్లా తాత్కాలిక నాయకుడు షేక్ నయీం కాసెం మీడియాకు ఒక వీడియో పంపడు. ఆ వీడియోలో నయీం కాసెం మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ఇప్పటివరకు చేసిన దాడుల్లో తమ నాయకులు మరణించినా.. లెబనాన్ లో తమ సైన్య బలం చెక్కుచెదరలేదని అన్నాడు. లెబనాన్ లో ఇజ్రాయెల్ సైన్యం గత కొన్ని వారాలు చొచ్చుకొని వచ్చినా వారిని సమర్థవంతంగా నిలువరించామని తెలపాడు. తమ నాయకుడు హసన్ నస్రాల్లా మృతి తరువాత తదుపరి హిజ్బాల్లా నాయకుడు ఎవరో త్వరలోనే ప్రకటిస్తామని.. యుద్ధ పరిస్థితుల కారణంగా సమావేశాలకు జాప్యం జరుగుతోందని చెప్పాడు.
గాజాలో ఆగని వినాశనం
ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ సైన్యం విధ్వంసం సృష్టిస్తోంది. ఈ దాడుల్లో భవనాలన్ని కుప్పకూలిపోయాయి. శరణార్థి శిబిరాలు, ఆస్పత్రులు అని కూడా చూడకుండా నిర్ధాక్షిణ్యంగా దాడులు చేస్తోంది. తాజాగా ఉత్తర గాజా నగరంలోని కమల్ అద్వాన్, అవ్దా, ఇండోనేషియన్ ఆస్పత్రులు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యాధికారులు ఆదేశించారు. ఆస్పత్రుల్లోని పేషెంట్లు, వైద్య సిబ్బంది వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించారు.