Revanth On Musi River: మూసీ అభివృద్ధి విషయంలో ఏం జరుగుతోంది? ప్రభుత్వానికి అడ్డుకునేందుకు కావాలనే కుట్రలు చేస్తున్నారా? రోజుకో అస్త్రాన్ని తెరపైకి తెచ్చి విపక్షం డ్రామాలాడుతోందా? హైడ్రాకు చట్ట బద్దత తీసుకొచ్చిన తర్వాత నేతల్లో మార్పు వచ్చిందా? కూల్చివేతల విషయంలో సీఎం రేవంత్రెడ్డిని వివిధ పార్టీల నేతలు కలుస్తున్నారా? అవుననే మాటలు బలంగా వినిపిస్తున్నాయి.
మూసీ అభివృద్ధి విషయంలో రేవంత్ సర్కార్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. విపత్తులను అరికట్టాలంటే కూల్చివేతలు తప్పవంటోంది ప్రభుత్వం. ఈ విషయంలో అన్నివర్గాలకు న్యాయ చేస్తామంటున్నారు సీఎం రేవంత్రెడ్డి.
మూడురోజుల ఢిల్లీ టూర్లో భాగంగా మంగళవారం నాడు సీఎం రేవంత్ రెడ్డిని అధికారిక నివాసంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కలిశారు. ఇరువురు మధ్య మూసీ ప్రక్షాళన విషయం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
వరదలు వస్తే ఇంతకంటే తీవ్రంగా నష్టపోతామని, ఆ పరిస్థితి తలెత్తక ముందే చర్యలు చేపడితే మంచిదని ముఖ్యమంత్రి అన్నారు. మూసీ ప్రక్షాళన విషయంలో నిర్వాసితులకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తగా చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు.
ALSO READ: కన్నుల పండుగగా సద్దుల బతుకమ్మ…ప్రాముఖ్యత ఇదే !
మన కళ్ల ముందే జరుగుతున్న విపత్తులను చూస్తున్నామని, తెలిసీ అదే రూట్లో వెళ్లడం కరెక్ట్ కాదని అన్నట్లు అంతర్గత సమాచారం. ఈ క్రమంలో సామాన్యులు, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని సీఎం రేవంత్ తెలిపారు.
హైడ్రా కూల్చివేతలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. మూసీ సుందరీకరణ విషయంలో నిర్వాసితులను ఎలా ఆదుకోవాలన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అసద్ పలు సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నమాట. చెరువులు, ఎఫ్టీఎల్లను కబ్జా చేసినవారి జాబితాను ఆల్రెడీ సేకరణ చేసింది హైడ్రా. రేపో మాపో కొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు ప్రభుత్వ వర్గాల మాట.