EPAPER

Damagundam Forest: అన్నింటికీ ఆలవాలమైన దామగుండాన్ని కాపాడుకుందాం

Damagundam Forest: అన్నింటికీ ఆలవాలమైన దామగుండాన్ని కాపాడుకుందాం

Damagundam Forest: మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నానాటికీ అడవులు తగ్గిపోయి, కాలుష్యం పెరుగుతోంది. ఈ కీలక సమయంలో పచ్చదనాన్ని పెంచాల్సిన కేంద్ర సర్కారు అభివృద్ధి పేరిట అడవుల విధ్వంసానిక పూనుకోవటం విచారకరం. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని దామగుండం అటవీ ప్రాంతం ఇప్పుడు అలాంటి ముప్పునే ఎదుర్కొంటోంది. వికారాబాద్‌ జిల్లాలోని పూడూరు మండలంలోని దామగుండం అటవీ జీవ వైవిధ్యంతో కూడుకున్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. అరుదైన ఔషధ మొక్కలతోపాటు విలువైన వృక్ష, జంతుజాతులకు ఈ ప్రాంతం ఆలవాలంగా ఉంది. అయితే, ఇక్కడ అతి తక్కువ ఫ్రీక్వెన్సీ రాడార్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, దీనికోసం అరుదైన వృక్షజాతులకు ఆలవాలమైన ఈ అటవీ ప్రాంతాన్ని భారత నౌకాదళానికి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదన వచ్చిన నాటినుంచీ స్థానికులతో పాటు తెలంగాణలోని పర్యావరణ కార్యకర్తలు దామగుండం అటవీ సంరక్షణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నేతృత్వంలో దీనిపైనిరసన తెలుపుతున్నారు. అయితే, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందనా లేకపోవటం విచారకరం.


Also Read: పండుగ సమయంలోనూ జీతాలివ్వరా..? ఇదేనా ప్రజా పాలన..? : హరీష్ రావు

ఈ రాడార్ కేంద్రం కోసం దామగుండం అటవీ ప్రాంతంలో సుమారు 2,900 ఎకరాల విస్తీర్ణంలోని 12 లక్షల చెట్లను నరికివేయాల్సి ఉంటుందని ఒక అంచనా. దీనివల్ల ఈ ప్రాంతంలోని పాతిక గ్రామాల పరిధిలోని సుమారు 60 వేల మంది జీవనం ఆటుపోట్లకు గురికానుంది. ఈ అడవి లేకపోవటం వల్ల ఈ ప్రాంతంలోని పంట భూములు కోతకు గురవటం గాక, అడవిపై ఆధారపడి బతికే పశుపాలకులకు ఉపాధి కొరవడనుంది. ఈ ప్రాంతంలోని అనేక చెరువులు, కుంటలు, చిన్న చిన్న జలాశయాలు కూడా కనుమరుగు కావటంతో ఇక్కడి జీవవైవిధ్యం దెబ్బతిని అనేక అరుదైన ప్రాణులు కనుమరుగు కానున్నాయి. ఈ కేంద్రం నుంచి వెలువడే రేడియేషన్‌, అటవీ నిర్మూలన మూలంగా జరిగే పుప్పొడి కాలుష్యం కారణంగా శ్వాసకోశ రుగ్మతలు వస్తాయి. అంతేకాదు, ఇక్కడున్న చారిత్రక బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి తీరని నష్టం జరిగే ఆస్కారం ఉన్నది.


ప్రస్తుతం మన తెలంగాణలో 24.06 శాతం ప్రాంతంలోనే పచ్చదనం ఉన్నది. కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్ర విస్తీర్ణంలో మరో 9.27 శాతం పచ్చదనం పెరగాల్సి ఉంది. ఈ తరుణంలో ఉన్న పచ్చదనాన్ని అభివృద్ధి పేరుతో నాశనం చేసుకోవటం వివేక వంతమైన నిర్ణయం కాబోదు. ఇప్పటికే, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వివిధ నిర్మాణాల కారణంగా పచ్చదనం తగ్గిపోయింది. నగరం కాలుష్య కోరల్లో ఉక్కిరిబిక్కిరవుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక (2024) ప్రకారం.. హైదరాబాద్‌లో గాలి నాణ్యత ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉన్నది. నానాటికీ విస్తరిస్తున్న నగరానికి సమీపంలోని దామగుండం వంటి ప్రాంతాలే భవిష్యత్తులో ఆక్సిజన్ అందించే వనరులుగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి, ఈ రాడార్ కేంద్రాన్ని మరోచోటకు తరలించే మార్గాలేమైనా ఉన్నాయేమో పరిశీలించాల్సి ఉంది. కోట్లు ఖర్చు పెట్టి మనం చెట్లు నాటగలం కానీ, ఒక జీవిత కాలంలో జీవవైవిధ్యం ఉన్న ఒక్క నాలుగెకరాల అడవిని సృష్టించలేమనే వాస్తవాన్ని పాలకులు గుర్తెరగాలని మనవి.

Related News

BJP: విద్య కాషాయీకరణను ఆపుదాం..

Raj Pakala: 111 జీవోలో.. ‘రాజ్’ దర్బార్, బావమరిది కళ్లలో ఆనందమే లక్ష్యం – జన్వాడలో కేటీఆర్ భూ జైత్రయాత్ర

Nagendrababu Rajyasabha : ఫైనల్ డెసిషన్ కు వచ్చేసిన డిప్యూటీ సీఎం.. రాజ్య సభకు మెగా బ్రదర్?

Crop Loan War : రైతు రుణ మాఫీపై సీఎం రేవంత్ దిమ్మ తిరిగే క్లారిటీ

Punganuru Ycp Politics : పుంగనూరు వెళ్తానన్న జగన్.. ఇంతలోనే యూటర్న్!

Manipur: మణిపూర్ మంటలు ఆగేదెప్పుడు..?

×