BJP Penetration: గత పదిన్నరేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం-2020 అమలుతో ప్రజాస్వామిక సెక్యులర్ రాజ్యం స్థానంలో హిందూ మతోన్మాద రాజ్యాన్ని స్థాపించడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఎన్టీయే లాంటి కేంద్రీకృత పరీక్షలకు ఆమోదముద్ర వేసి, పేపర్లు లీకు చేయడం, అమ్ముకోవడాన్ని ప్రోత్సహిస్తున్నది. తద్వారా 24 లక్షలకు పైగా విద్యార్థులకు అన్యాయం జరిగింది. 2014 బడ్జెట్లో విద్యారంగానికి మోదీ సర్కార్ ఆరు శాతం నిధులను కేటాయించగా.. 2024 నాటికి అవి 2.5 శాతానికి పడిపోయాయి. పాఠ్యాంశాల నుంచి డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం, పీరియాడిక్ టేబుల్, మొఘలుల చరిత్రను తొలగించడం, గాంధీజీని చంపిన గాడ్సే పాఠాన్ని వక్రీకరించడం లాంటి చర్యలు శాస్త్రీయ దృక్పథాన్ని, హేతుబద్ధతను తుదముట్టించడమే. పాఠశాల విద్యను 5+3+3+4 పద్ధతిలో వ్యవస్థీకరించి, పాఠశాల విద్యావ్యవస్థను, పాఠ్య ప్రణాళికను బీజేపీ సర్కార్ ధ్వంసం చేస్తున్నది.
Also Read: ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్.. 2011 జనాభా లెక్కల ప్రకారమే..
తమ కాషాయీకరణలో భాగంగా విద్యార్థులకు రాజ్యాంగ స్ఫూర్తిని కలిగించే పాఠ్యాంశాలను సమూలంగా తొలగించారు. 11వ తరగతిలో సమాఖ్య విధానం, పౌరసత్వం, జాతీయవాదం, భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు లౌకిక వాదం అనే అంశాలను తొలగించారు. 12వ తరగతిలో భారత్తో పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ వంటి ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు, భారతదేశ ప్రణాళికబద్ధమైన ఆర్థిక అభివృద్ధి, భారత్లో సామాజిక ఉద్యమాలు, కులం, మతం, లింగ వివక్ష, వైవిద్యం, ప్రపంచీకరణ విధానాలు, దేశవిభజన, స్థానిక ప్రభుత్వాలు. పర్యావరణం, సహజవనరులు, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలను తొలగించారు. విశాల భావాలతో విలసిల్లాల్సిన విశ్వ విద్యాలయాలను కాషాయ రాజకీయాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే- యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసినట్టు ప్రాథమిక, మాధ్యమిక స్థాయుల్లోనే కాదు; ఉన్నత విద్యా వ్యవస్ధల్లోనూ నాణ్యతా ప్రమాణాలు ఘోరంగా దిగజారిపోయే ప్రమాదం ఉంది. మేధావులు, విద్యార్థి యువజన సంఘాలు, బాధ్యతాయుతులైన పౌరులూ నాణ్యమైన విద్య కోసం గొంతెత్తాలి.