⦿ అటు బావ ఫాంహౌజ్.. ఇటు బావమరిది నిర్మాణం
⦿ జన్వాడలో ఇప్పటికీ కొనసాగుతున్న కేటీఆర్ భూ జైత్రయాత్ర
⦿ క్లియరెన్స్ లేని 7 ఎకరాల్లో ఫాంహౌజ్.. అన్నీ అక్రమాలే
⦿ 6,700 గజాల్లో ఇంద్ర భవనం.. ఇంపోర్టెడ్ సామగ్రితో సొబగులు
⦿ రికార్డుల్లో ఎక్కడా పేరు లేకుండా జాగ్రత్తలు
⦿ ప్రభుత్వం మారడంతో గుట్టుచప్పుడు కాకుండా హౌజ్ వార్మింగ్
⦿ ఫైనల్కి వచ్చిన పనులు.. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలెప్పుడు?
⦿ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌజ్పై స్వేచ్ఛ ప్రత్యేక కథనం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక స్కాములు వెలుగుచూశాయి. సొంతవాళ్లను అందలం ఎక్కించిన తీరు కళ్ల ముందే కనిపిస్తోంది. అలా, చాలామంది వారి వారి పాత్రలకు న్యాయం చేసి, వేల కోట్లు వెనకేసుకున్నారు. వారిలో ప్రధాన పాత్రధారి, కేటీఆర్ బావమరిది రాజేంద్రప్రసాద్ పాకాల అలియస్ రాజ్ పాకాల. తెలంగాణ ఏర్పడక ముందు ఈయనో ఈవెంట్ మేనేజర్. నామ్ కే వాస్తే టైపులా అప్పటికి 4 కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాడు. తెలంగాణ వచ్చి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 20 కంపెనీలకు డైరెక్టర్గా మారిపోయాడు. ఎలాంటి పనులు చేయకుండానే వాటాలు తీసుకుని 12 కంపెనీల నుంచి జంప్ అయ్యాడు. ఇవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డిటెయిల్స్ మాత్రమే. పార్ట్నర్షిప్లు అయితే కోకొల్లలు. ఆ దందాలే వేరు.
ఆ మధ్య డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వారు రాజ్ పాకాలకు వాటాలు ఇచ్చింది, కార్లు కొనుగోలు చేసింది నిజమేనని ఒప్పుకున్నారు. అయితే, ఇది ఎప్పుడో కావడంతో పోలీసులకు లెక్కలు సరిపోలేదు. పదేళ్లు సంపాదించిన అక్రమ సంపద దుబాయికి చేర్చి, అక్కడి నుంచి మలేషియా, అటు నుంచి సింగపూర్కు, అక్కడి కంపెనీల నుంచి మళ్లీ హైదరాబాద్లోని బడా కంపెనీలకు పెట్టుబడుల రూపంలో డబ్బులు వస్తున్నాయి. ఇలా రూ. వేల కోట్ల సంపద దేశం దాటి వెళ్లింది. అయితే, రాజ్ పాకాల మాత్రమే మళ్లీ ఇండియాలో పెట్టుబడులు పెడుతుండటం సస్పెన్స్గా మారింది. జన్వాడకు అటువైపు బావ ఫాంహౌజ్ ఉంటే, ఇటువైపు రాజ్ పాకాల అక్రమంగా నిర్మాణం చేపడుతున్నాడు. ఇక్కడే సెటిల్ అవ్వడానికి ఇదంతా చేయిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: రాష్ట్ర పర్యాటకంపై అమెరికాలో అంతర్జాతీయ స్థాయి ప్రచారం.. ప్రశంసల పరంపర
అంతా ఇంపోర్టెడ్ సామాగ్రి
111 జీవో ఎత్తివేస్తామని చెప్పగానే జన్వాడలో లిటిగేషన్ ఉన్న 7 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాడు రాజ్ పాకాల. సర్వే నెంబర్ 691లో ఇది ఉంది. 1999లో కొనుగోలు చేసిన ఎస్ లక్ష్మి ప్రభాకర్, శ్రీ కేఎస్ఎన్ ఫిన్ కాప్ ప్రైవేట్ లిమిటెడ్కి విక్రయించింది. ఈ కంపెనీలోని డైరెక్టర్స్ 2016లో మరో కంపెనీకి అమ్మినట్లు సెల్ డీడ్ చేసుకున్నారు. శ్రీమాతే ప్రాపర్టీస్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీకి బదులాయించారు. ధరణిలో శ్రీమాతే పేరుపై క్లియర్ కాలేదు. దీంతో తనకి అనుకూలమైన వ్యక్తులైన రావు గురుప్రసాద్ కృష్ణ రంగారావు, రావు శ్రీ రాజరాజేశ్వరీ దేవి పేర్ల మీదకి 2021న కంపెనీని మార్చేస్తారు. దీంతో ఇప్పుడు ఆ భూమి ఇంకా మ్యూటేషన్ కాలేదు. కానీ, పొజిషన్లో మాత్రం లేరు. 6500 గజాల ప్రాంతంలో 17 వేల స్క్వేర్ ఫీట్లతో వివిధ భవంతులను నిర్మిస్తున్నారు. 15 కోట్ల రూపాయలు నిర్మాణానికే ఖర్చు పెట్టారంటే ఎంత కాస్ట్లీ, ఇంపొర్టెడ్ వస్తువులను వాడుతున్నారో అర్ధం చేసుకోండి. స్విమ్మింగ్ పూల్తో పాటు లాంజ్లు, లావిష్ ఎంట్రెన్స్లు ఉన్నాయి.
పర్మిషన్స్ ఉండవు.. రిజిస్ట్రేషన్స్ కావు
111 జీవో పరిధిలో గ్రామపంచాయతీ నుంచి కానీ, హెచ్ఎండీఏ నుంచి గానీ అనుమతులు ఇవ్వరు. కరెంట్ మీటరు కూడా రాదు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు ఏది చేస్తే అదే చట్టం, అవే అనుమతులు. గ్రామ పంచాయతీకి సమాచారం ఇవ్వకుండానే రూ.15 కోట్లతో అక్రమంగా పర్మినెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పనులు కొనసాగుతున్నాయి. అక్కడ ఉండే అధికారులకు కనీసం విషయ పరిజ్ఞానం కూడా లేదు. ఎక్కడెక్కడ ఎవరు నిర్మిస్తున్నారు. ఎందుకు నిర్మిస్తున్నారో కూడా ఉండటంతో ఇలాంటి వారి దందా ఇంకా కొనసాగుతోంది.
Also Read: రైతు రుణ మాఫీపై సీఎం రేవంత్ దిమ్మ తిరిగే క్లారిటీ
ఫాంహౌజ్ను కూల్చివేస్తారా?
పేదవాడు అక్రమంగా గుడిసె వేసుకుంటే తెల్లారేసరికల్లా కూల్చివేసే అధికారులు, గత ప్రభుత్వంలో ఇబ్బడిముబ్బడిగా సంపాదించి. రూల్స్ గిల్స్ జాన్తా నై అంటూ 111 జీవోలో నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు జరపరా? మాటలకే పరిమితం అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ బినామీలు, బంధువులపై చర్యలు తీసుకోలేరా? రికార్డుల్లో మా పేరు లేదు కాబట్టి మాది కాదని తప్పించుకోవచ్చు. అది కూల్చివేస్తేనే కదా ఎవరిదో అసలు విషయం బయటకు పొక్కేది. స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం అక్కడికి చేరుకోవాలని పెద్ద సాహసం చేసింది. ఓ చెక్ పోస్ట్లో ఉండే సెక్యూరిటీ కళ్లుకప్పి వేళ్లింది. అక్కడికి వెళ్లి పనిచేస్తున్న వారిని అడిగితే, కేటీఆర్ ఫాంహౌజ్ అని చెప్పుతున్నారట. ఇక్కడికి ఎవరు రావొద్దని, ఇది కేటీఆర్ సర్ది. వాళ్ల బంధువులది అని చెబుతున్నారు. అలా అధికారులను బెదిరించి పనులను చివరి దశకు తీసుకొచ్చారు. మూడు నెలల క్రితమే దగ్గరి సన్నిహితుల కుటుంబాలతో కలిసి రాజ్ పాకాల గృహ ప్రవేశం చేశారని అక్కడి వారు చెబుతున్నారు.