Crime News: నేటి కాలంలో బంధాలు లేవు.. అనుబంధాలు లేవు. తేడా వస్తె దేనికైనా రెడీ అంటున్నారు కొందరు. ఇక కొన్ని కుటుంబ కలహాలు చూస్తే.. ఔరా అనాల్సిందే. గతంలో కుటుంబం అంటే ఏకంగా 10 మందికి పైగానే కలిసి ఉండేవారు. నేడు ఉమ్మడి అనే పదం వినిపించని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఉన్న ఆ నలుగురిలో కూడా విభేదాలు.
ఈ విభేదాలు కోపానికి దారి తీసి.. మనుషులమనే ఆలోచనను కూడా దరికి రానివ్వడం లేదు. ఆ కోపంలో మనం చేసిన తప్పును మళ్లీ సవరించుకోవాలన్న కుదరని పని. అటువంటిదే ఓ కోడలు.. తనను తాను నియంత్రించుకోలేని కోపంలో ఓ తప్పు చేసింది. ఇప్పుడు ఆ తప్పుకు బాధపడ్డా ఏమి చేయలేని పరిస్థితి. ఇంతకు ఏమి జరిగిందంటే ?
గుంటూరు జిల్లా తుళ్లూరులో కంభంపాటి శేషగిరి, పావని దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో ఒకరికి వివాహం చేశారు సంబరంగా ఆ తల్లిదండ్రులు. కోడలు ఇంటికి వచ్చిందని, వారు ఆనందంలో ఉన్నారు. కొద్దిరోజులకు కోడలు, అత్త మధ్య విభేదాలు వచ్చాయి. రోజూ ఏదో ఒక గొడవ తరచూ వారి మధ్య జరుగుతూ ఉండేది.
ఇటీవల ఒకరోజు రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో కోపంలో ఉన్న కోడలు.. ఒక్కసారిగా అత్త పైన పడి చెవి కొరికి వేసింది. ఆ చెవి ముక్క కూడా నేల రాలింది. ఇక భరించలేని నొప్పితో ఆ అత్త బాధ అంతా ఇంతా కాదు. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను వైద్యశాలకు తరలించారు. ఆ చెవి ముక్కను కూడా తీసుకెళ్లి వైద్యులకు చూయించారు.
Also Read: Black Magic: అత్తమామపై కోడలు చేతబడి ప్లాన్.. రివర్స్ ప్లాన్ వేసిన బాబా.. కట్ చేస్తే..
ఆ వైద్యులు చెవిని అతికించేందుకు ఏవైనా మార్గాలు ఉన్నాయా అంటూ చర్చించుకున్నారు. చివరికి చెవి ఊడిపడి ఎక్కువ సమయమైంది కాబట్టి.. అతికించడం కుదరదని తేల్చి చెప్పారు. ఇక చెవి వద్ద చికిత్స చేసి పంపించి వేశారు. తాను చేసిన తప్పును గ్రహించిన కోడలు మాత్రం అలాగే మిన్నకుండి పోయింది. కానీ ఈ ఘటనపై ఫిర్యాదు అందితే తప్పక కేసు నమోదు చేస్తామని, చట్టరీత్యా తీసుకోవలసిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరి చివరికి ఏమి జరిగిందో తెలియాల్సి ఉంది.
ఏదిఏమైనా మన కోపం మనకు ప్రధాన శత్రువు. కోపంలో తీసుకొనే నిర్ణయాలు కూడా అనర్థాలను తెచ్చి పెడుతాయని మానసిక వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అత్త చెవి కొరికి పడవేసిన కోడలు అంటూ.. స్థానికంగా ప్రచారం కావడంతో.. ఈ టాపిక్ అక్కడ హాట్ టాపిక్ గా మారింది.