NTR About His Children: తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, తన పిల్లల గురించి, వారు పెరిగే విధానం గురించి కీలక విషయాలు వెల్లడించారు. ‘దేవర’ సినిమా రిలీస్ సందర్భంగా అసోసియేటెడ్ ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో వివరించారు. తన తండ్రి తనను ఎలా పెంచాడో, తాను తన పిల్లలను అలా పెంచుతున్నట్లు వెల్లడించారు. తనను కేవలం నటనకు పరిమితం చేయకుండా నచ్చిన రంగాల్లో ప్రోత్సహించారని చెప్పారు. “మా నాన్న నన్ను కేవలం నటనకు పరిమితం చేయలేదు. నాకు నచ్చిన రంగాల్లో ప్రోత్సహించారు. నేను నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిని. ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్ని. చాలా చోట్ల నా ప్రదర్శనలు ఇచ్చాను. మా నాన్న నా మీద ఏనాడు ఒత్తిడి పెట్టి ఇదే పని చేయాలని చెప్పలేదు” అని చెప్పుకొచ్చారు.
నాన్న లాగే నా పిల్లలను పెంచుతున్నా- ఎన్టీఆర్
తన తండ్రి తనను ఎలా పెంచారో.. ఇప్పుడు తాను తన పిల్లలను అలాగే పెంచుతున్నట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. “మా నాన్న నన్ను ఎలా పెంచారో. నేను నా పిల్లలను అలాగే పెంచుతున్నాను. మా అబ్బాయిలు అభయ్, భార్గవ్ విషయంలో నేనో కీలక నిర్ణయం తీసుకున్నాను. వారిని ప్రెజర్ చేసి ఒకే రంగంలో రాణించాలని కోరుకోవడం లేదు. వారు సొంత నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాను.
పిల్లలను అతిగా ఒత్తిడికి గురి చేయడం మంచిది కాదు. వాళ్లను కొత్తగా ఆలోచించేలా చేయాలి. వారి ఆలోచనలను వినాలి. వారికి నచ్చిన బెస్ట్ రంగాల్లో రాణించేలా ఉత్సాహపరచాలి. ప్రస్తుతం మా అబ్బాయిలు నటనా రంగంలోకి రావాలని అనుకుంటున్నారు. వారు పెరుగుతున్న పరిస్థితులు, భవిష్యత్ లో వారి నిర్ణయాలు మారే అవకాశం ఉండొచ్చు. వాళ్లు ఏది మంచి అనిపిస్తే ఆ రంగం వైపు నేను వెనుకుండి నడిపిస్తాను” అని చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై ప్రశంసలు
ఎన్టీఆర్ పిల్లల పెంపకం గురించి తీసుకుంటున్న జాగ్రత్తల పట్ల నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంటున్నప్పటికీ తన పిల్లల గురించి ఇంతలా ఆలోచించడం గ్రేట్ అంటున్నారు. ప్రతి తండ్రి ఇలాగే ఆలోచిస్తే పిల్లలు కచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారని కామెంట్స్ చేస్తున్నారు. ఇతర తల్లిదండ్రులు కూడా ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని పిల్లలను పెంచాలని సూచిస్తున్నారు.
‘దేవర’తో ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్
ఇక తాజాగా ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. తీరప్రాంత కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ. 500 కోట్లు వసూళు చేసింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ డైరెక్టర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అటు అయాన్ ముఖర్జీతో కలిసి ‘వార్ 2’లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ‘దేవర 2’లో నటించే అవకాశం ఉంది.
Read Also: క్రేజీ అప్డేట్.. ‘దేవర 2’ షూటింగ్ అప్పటి నుంచేనా..?