హైదరాబాద్, స్వేచ్ఛ: రవాణా శాఖలో కీలక సంస్కరణలు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు. సచివాలయంలో సారథి వాహన్ పోర్టల్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మోటారు వాహన చట్టంలో భాగంగా దేశంలో 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి వాహన్ పోర్టల్ అమలు చేస్తోందన్నారు. ఇంటర్ స్టేట్ రిలేషన్స్కి ఇబ్బంది వస్తుండడంతో క్షేత్ర స్థాయిలో ఆర్టీవో డీటీవోలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణలో కూడా సారథి పోర్టల్లో చేరుతున్నామని చెప్పారు. జీవో 28 ద్వారా ఇది అమలు చేస్తున్నామని తెలిపారు.
Also Read: రాష్ట్ర పర్యాటకంపై అమెరికాలో అంతర్జాతీయ స్థాయి ప్రచారం.. ప్రశంసల పరంపర
‘‘దేశంలో వాహనాలకు స్క్రాపింగ్ పాలసీ తీసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాహన ఓనర్ మార్పిడి చేసుకోవడానికి ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలు అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేసే దానిపై జీవో తీసుకొచ్చాం. వాహనాల చెకింగ్ సరైన విధానంలో అమలు జరగడం లేదని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ తీసుకొస్తున్నాం. ఒక్కో సెంటర్కి 8 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో 32 సెంటర్లు తీసుకొస్తున్నాం. దేశవ్యాప్తంగా సంవత్సరానికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక నిబంధనలు తీసుకొస్తున్నాం. రోడ్డు భద్రతపై యునిసెఫ్ సహకారం తీసుకుంటున్నాం. ప్రతి పాఠశాలలో రోడ్డు సేఫ్టీపై అవగాహన కలిస్తున్నాం. సిగ్నల్, జీబ్రా క్రాసింగ్ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకు 8 వేల లైసెన్సులు రద్దు చేశాం. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉండదు. వాహనాలు కొనుక్కున్న వారి పేరు మీద నమోదు చేసుకునే అవకాశం ఉండదు. ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు పొన్నం ప్రభాకర్.
Also Read: తెలంగాణ వైపు టీడీపీ చూపు.. ఎఫెక్ట్ ఎవరికి ? వలసలకు లీడర్స్ రెడీ అయ్యారా..