Tirumala Brahmotsav: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సంధర్భంగా తిరుమల భక్తజన సందోహంగా మారింది. శ్రీవారి గరుడోత్సవ దర్శనం కోసం భక్తులు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా.. విదేశీయులు కూడా అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. అసలే దసరా సెలవులు. పాఠశాలలకు సెలవులు ప్రకటించగా.. కలియుగ వైకుంఠం శ్రీ తిరుమలేశుని దర్శనం కోసం రోజురోజుకూ భక్తుల తాకిడి అధికంగా తిరుమలకు తాకుతోంది. అది కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తుల హడావుడి కనిపిస్తోంది.
అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు 9 రోజుల పాటు జరుగగుతున్న ఈ ఉత్సవాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామి వారు వివిధ వాహనాలపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్యదర్శనం ఇవ్వడం ఆనవాయితీ. అందుకే ఆ దేవదేవుని దర్శన భాగ్యం కోసం భక్తుల రాకతో మాడవీధుల్లోని గ్యాలరీలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. తిరువీధులు ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మాదవీధుల గ్యాలరీలు నిండుకోవడంతో భక్తులను శిలాతోరణం క్యూ లైన్ల వద్దకు టీటీడీ తరలిస్తోంది.
శిలాతోరణం నుంచి నార్త్ వెస్ట్ ప్రవేశం మార్గం గుండా భక్తులకు గరుడ వాహన సేవ దర్శనం కల్పించేందుకు టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. కాగా గోవిందా నామస్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి. అలిపిరి మెట్ల మార్గం గుండా సైతం భక్తుల తాకిడి అధికంగా ఉండగా.. దారి పొడవునా టీటీడీ ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతా చర్యలు కూడా చేపట్టింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల సంధర్భంగా ఐదో రోజు గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
అందుకే నేటి స్వామి వారి గరుడోత్సవం దర్శనం కోసం ఒక రోజు ముందుగానే భక్తులు తిరుమలకు చేరుకోగా.. మొత్తం 3 లక్షల మందికి పైగా రానున్నట్లు ఈవో శ్యామలారావు ప్రకటించారు. అలాగే తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే.. వారిపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా టీటీడీపై అసత్యప్రచారం చేసినా చర్యలు తప్పవన్నారు.
తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ అన్ని చర్యలు చేపట్టిందని, ఎవరైనా అవాస్తవాలు ప్రచారం చేస్తే భక్తులు నమ్మవద్దని ఈవో కోరారు. మొత్తం మీద తిరుమలలో.. నేడు భక్తజనవాహిని నిండగా.. దేవదేవుల వారు భక్తులకు నేడు దివ్యదర్శనం ఇస్తున్నారు. అయితే సాధారణంగా స్వామి వారి దర్శనానికి 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు రాగా.. స్వామి వారి సర్వదర్శనానికి 18 నుండి 24 గంటల సమయం పడుతుందని అధికారుల అంచనా.