Haryana Election Results 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? ఫలితాలు చివరి వరకు ప్రధాన పార్టీలను దోబూచిలాడాయా? ఆరంభంలో వెనుకబడిన కమలం ఎలా పుంజుకుంది? మొదట్లో జోరు మీదున్న హస్తం.. చివరలో ఎందుకు వెనుకంజ వేసింది? బీజేపీ వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యిందా? ఈ ఫలితాలు హస్తం పార్టీకి గుణపాఠం నేర్పాయా? దీన్ని నుంచి తేరుకుని మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికలకు సిద్ధమవుతుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ చరిత్ర క్రియేట్ చేసింది. హిస్టరీ పరంగా చూస్తే అక్కడ ఏ పార్టీ హ్యాట్రిక్ కొట్టిన సందర్భం లేదు. రెండుసార్లు మాత్రమే అక్కడ పార్టీలు గెలిచాయి. లేటెస్ట్గా ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే.. బీజేపీ దూసుకెళ్తోంది. హర్యానాలో బీజేపీ వ్యూహంపై చర్చ మొదలైపోయింది. మధ్యప్రదేశ్లో అమలు చేసిన ఫార్ములానే ఇక్కడా అమలు చేసింది.. సక్సెస్ దిశగా అడుగులు వేసింది.
జాట్లకు వ్యతిరేకంగా ఉన్న 35 కులాలను బీజేపీ ఏకం చేయడమే ప్రధాన కారణమన్నది నేతల మాట. ఈ విషయంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. జాట్ల మినహా మిగతా కులాలు కమలానికి అండగా నిలిచాయి. పర్సెంటేజ్ తగ్గినా సీట్లు సాధించడంలో సక్సెస్ అయ్యింది కమలం. జాట్లు ప్రాబల్యం 37 నియోజకవర్గాల్లో ఉంది. బీజేపీ మాత్రం ఈ కమ్యూనిటీని దూరంగా పెట్టింది.
ఎన్నికలకు కేవలం ఐదు నెలల ముందు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేసింది బీజేపీ. ఈ అంశం కూడా ఆ పార్టీకి కలిసొచ్చింది. సైన్యంలో అగ్నిపథ్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఎన్నికల ముందు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు కమలనాథులు. కనీస మద్దతు ధర కోసం రైతులు ఆందోళన చేసినా పట్టించుకోలేదన్న అపవాదు ఆ పార్టీపై ఉంది. మరోవైపు రెజ్లర్లు ఆందోళన సైతం ప్రభావం చూపింది.
ALSO READ: కాశ్మీర్లో బీజేపీకి ఊహించని దెబ్బ.. మోదీశకం ముగింపుకు సంకేతాలా?
మిగతా కమ్యూనిటీలను దగ్గరకు చేర్చుకుంటే కమలం వికసించేది కాదనే వాదన సైతం లేకపోలేదు. ప్రభుత్వ నెగిటివ్ ఓటును ఆప్, బీఎస్పీ రూపంలో చీలిపోయాయి. ఆ రెండు పార్టీలకు దాదాపు మూడు శాతంపైగానే ఓట్లు వచ్చాయి. వాటి ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఏడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు 50కు పైగానే సీట్లు వస్తాయని అంచనాలు వేశాయి. బీజేపీకి కేవలం 26 సీట్లు మాత్రమే వస్తాయని లెక్క కట్టాయి.
ఛత్తీస్ఘడ్ ఫలితాల మాదిరిగా హర్యానాలో కాంగ్రెస్కు సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ విజయాన్ని ఆప్ దిబ్బ తీసిందనే వాదన కాంగ్రెస్ నేతల్లో క్రమంగా బలపడుతోంది. చీపురుతో జత కడితే బాగుండేదని అంటున్నారు మరికొందరు నేతలు. మొన్నటి లోక్సభ సభల్లో కాంగ్రెస్ సత్తా చాటినా.. అసెంబ్లీ ఎన్నికల వచ్చేసరికి సరైన వ్యూహం లేకపోవడం కారణమన్నది కొందరి రాజకీయ విశ్లేషకుల మాట. ఈ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని రానున్న ఢిల్లీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సరైన వ్యూహం అనుసరిస్తుందని భావిద్దాం. (ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లోనే పూర్తి ఫలితాలు రానున్నాయి. ప్రస్తుతం అంచనాల ప్రకారం.. ఈ వివరాలు అందించామని గమనించగలరు).