Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లోకి రాయల్స్ అంటూ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యారు. అయితే వీరందరూ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. మునుపటి సీజన్స్లో కంటెస్టెంట్స్గా కనిపించిన వారినే మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా తీసుకొచ్చారు బిగ్ బాస్. అయితే కొత్త కంటెస్టెంట్స్ అడుగుపెట్టగానే పాత కంటెస్టెంట్స్తో నామినేషన్స్ గొడవ మొదలయ్యింది. రాయల్స్ అంతా.. తాము ఆడియన్స్లాగా బయట నుండి షో చూసి వచ్చామని చెప్తున్నా కూడా అది అర్థం చేసుకోని పాత కంటెస్టెంట్స్ నామినేషన్స్ విషయంలో వారిపై అప్పుడే పగ కూడా పెంచేసుకుంటున్నారు. ఇక్కడ హైలెట్ ఏంటంటే కొత్తగా వచ్చిన రాయల్స్ మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉంటుంది.
నామినేట్ చేయొద్దు
కొత్తగా వచ్చిన రాయల్స్ను, మెగా చీఫ్ అయిన నబీల్ను ఎవరూ నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ ముందే ఆదేశించారు. ముందుగా హరితేజ వచ్చి యష్మీ, పృథ్విలను నామినేట్ చేసింది. యష్మీని నామినేట్ చేస్తూ తను కొందరికీ మాత్రమే సపోర్ట్ చేస్తుందని, కొందరు ఏం చేసినా తప్పులాగా చూస్తుందని చెప్పింది. అంతే కాకుండా తనకంటూ ఒక చిన్న గ్రూప్ కూడా ఉందని అంది. తనను నామినేట్ చేస్తూ మణికంఠతో తన ప్రవర్తన గురించి ప్రస్తావించింది. ఇక పృథ్విని నామినేట్ చేసిన హరితేజ.. తను ఇతరులు చెప్పిన మాటను మాత్రమే వింటాడని, సొంతంగా ఆడడం ఎప్పుడూ చూడలేదని చెప్పింది. దానికి పృథ్వి ఒప్పుకోలేదు.
యష్మీకే నామినేషన్స్
తర్వాత వచ్చిన గౌతమ్.. విష్ణుప్రియా, యష్మీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియా కేవలం ఒక మనిషిపైనే ఫోకస్ చేస్తూ గేమ్ సరిగా ఆడడం లేదని అన్నాడు. దీంతో తన ఫీలింగ్స్ను ఓపెన్గా చూపించడంలో అస్సలు ఆలోచించను అంటూ సమాధానమిచ్చింది విష్ణుప్రియా. యష్మీని నామినేట్ చేస్తూ చీఫ్ కంటెండర్ టాస్కులో మణికంఠతో తన ప్రవర్తనను గుర్తుచేశాడు గౌతమ్. ఆ తర్వాత వచ్చిన మెహబూబ్ కూడా యష్మీని నామినేట్ చేసి అదే మాట చెప్పాడు. దీంతో మణికంఠ గురించి ఆలోచిస్తూ.. తనకు రాయల్స్ అందరూ సపోర్ట్ చేస్తూ కావాలనే ఇతర కంటెస్టెంట్స్ను నామినేట్ చేస్తున్నారని ఓజీ టీమ్ భావించడం మొదలుపెట్టింది. కానీ హరితేజ మాత్రం ఈ నామినేషన్స్తో అయినా బయట ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఓజీ టీమ్కు తెలిస్తే బాగుంటుంది అని భావించింది.
ఏడుస్తూనే ఉంటావు
నయని పావని వచ్చి విష్ణుప్రియా, సీతను నామినేట్ చేసింది. విష్ణుప్రియా గేమ్ను సీరియస్గా తీసుకోవడం లేదని ఆరోపించింది. దానికి విష్ణుప్రియా సీరియస్గా రియాక్ట్ అయ్యింది. సీత ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుందని తనను కూడా నామినేట్ చేసింది. ఇక అందరిలో టేస్టీ తేజ నామినేషన్సే డిఫరెంట్. తను వచ్చి సీత, మణికంఠను నామినేట్ చేశాడు. మణికంఠను ఒక్కరైనా నామినేట్ చేసినందుకు యష్మీ హ్యాపీగా ఫీల్ అయ్యింది. యష్మీ తనకు చేసింది అన్యాయం అయితే ఇంటి నుండి ఫుడ్ వచ్చిన టాస్కులో మణికంఠ యష్మీకి చేసింది కూడా అన్యాయమే అని తేజ గుర్తుచేశాడు. పదేపదే తన సమస్యలను చెప్పడం వల్ల ప్రేక్షకులకు చిరాకు వస్తుందని, ఒకవేళ అదే తన స్ట్రాటజీ అయితే తనను మంచి గేమర్ అంటూ ప్రశంసించాడు.