AC Train Travel: రైలులో ప్రయాణించే వ్యక్తులు పండుగ సీజన్ తో పాటు సెలవు దినాలలో చాలా ఇబ్బందులు పడుతారు. రద్దీ సమయంలో కన్ఫర్మ్ టికెట్ పొందడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సమేతంగా రైలు ప్రయాణం చేయాలంటే నరకంలా అనిపిస్తుంది. ఇలా ఇబ్బందులు పడే ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అన్ రిజర్వ్ డ్ టిక్కెట్లపైనా ఏసీలో జర్నీ చేసే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు వెల్లడించింది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
అన్ రిజర్వ్ డ్ కోచ్ లు ఏసీ కోచ్ లు గా..
ప్రస్తుతం దేశం మొత్తం మీద 10,000 రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో శతాబ్ది, రాజధాని, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లు కూడా ఉన్నాయి. ఈ రైళ్లలో రోజుకు 2 కోట్ల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. దాదాపు 10 శాతం అంటే 20 లక్షల మంది రిజర్వేషన్లు చేసుకుని ప్రయాణిస్తున్నారు. పీక్ సీజన్ లో ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అలాంటి ప్రయాణీకులకు ఉపశమనం కలిగించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది.
ప్రస్తుతం ఉన్న అన్ని ఏసీ కోచ్లలో ప్రయాణీకుల సంఖ్యను నిర్ణయించారు. 72 మంది రిజర్వ్ డ్ టికెట్ హోల్డర్లు, కొంతమంది వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులు ఉన్నారు. ఈ సంఖ్య సుమారు 80 మందికి అటు ఇటుగా ఉంటుంది. వారి సామర్థ్యానికి అనుగుణంగా ఏసీలు ఏర్పాటు చేశారు. అన్ రిజర్వ్ డ్ కోచ్ నిండినప్పుడు ప్రయాణీకుల సంఖ్య దాదాపు 250 వరకు ఉంటుంది. ఏసీ సామర్థ్యాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. అందుకే, చాలా కాలంగా అన్ రిజర్వ్ డ్ కోచ్లను ఏసీ కోచ్ లు గా మార్చేందుకు రైల్వే అధికారులు కష్టపడుతున్నాయి.
ట్రయల్ రన్ సక్సెస్ అయినట్లు ప్రకటించిన రైల్వేశాఖ
ఇటీవల భుజ్- అహ్మదాబాద్ మధ్య నడిచే నమో భారత్ ర్యాపిడ్ రైల్ లో ఇటువంటి డిజైన్ తో కూడిన కోచ్ లను రైల్వే అధికారులు సిద్ధం చేశారు. రైల్వే ఇంజనీర్ల ప్రకారం, అన్ రిజర్వ్ డ్ కోచ్లలో ప్రయాణీకుల సామర్థ్యం స్థిరంగా ఉండదు. సో, గరిష్టంగా 270 మంది ప్రయాణీకుల సామర్థ్యం ప్రకారం యాక్సిల్ లోడ్ రెడీ చేశారు. అన్ రిజర్వ్ డ్ కోచ్ లో 15-15 టన్నుల ACలు అమర్చారు. ఈ నేపథ్యంలో కోచ్ పూర్తిగా చల్లగా ఉంటుంది. అచ్చం మెట్రోలో ప్రయాణించినట్లుగానే ఉంటుంది. ఇప్పటికే ఈ రైలులో నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. భవిష్యత్తులో, ఈ కాన్సెప్ట్ పై అన్ రిజర్వ్ డ్ కోచ్లను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.
శతాబ్ది-రాజధాని కంటే రెట్టింపు సామర్థ్యం కలిగిన ఏసీలు
శతాబ్ది-రాజధాని కంటే రెట్టింపు సామర్థ్యం ఉన్న ఏసీలను అన్ రిజర్వ్ డ్ కోచ్లలో అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం శతాబ్ది, రాజధాని వంటి ప్రీమియం రైళ్లలో ఒక్కో కోచ్ లో 8 టన్నుల సామర్థ్యం ఉన్న రెండు ఏసీలను అమర్చారు. అన్ రిజర్వ్ డ్ కోచ్లలో 15-15 టన్నుల రెండు ఏసీలను ఒక కోచ్లో అమర్చనున్నట్లు రైల్వే ఇంజినీర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కోచ్ పూర్తిగా చల్లగా ఉంటుందని తెలిపారు.