న్యూఢిల్లీ, స్వేచ్ఛ: దేశంలో మావోయిస్టు పోరాటం చివరి దశకు చేరిందని, ఈ దశలో రాష్ట్రాలు మరింత దూకుడుగా వ్యవహరించి హింసావాదుల ఆటకట్టించి, శాంతి భద్రతల స్థాపనకు కృషి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం దృష్టిపెట్టినట్లు తెలిపారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సుకు షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు తీవ్రవాదం అంతం కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాలంటూ పిలుపునిచ్చారు.
భ్రమలు తొలగుతున్నాయ్..
మావోయిస్టు పోరాటం మీద అందులోని యువతకు నమ్మకం నానాటికీ తగ్గిపోతోందని, వారంతా ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు అమిత్ షా వ్యాఖ్యానించారు. దేశంలో వారి మావోయిస్టు తీవ్రవాదం తుదిదశకు చేరిందని, ఇప్పటివరకు 13 వేల మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారని పేర్కొన్నారు. 2024లో 202 మంది మావోయిస్టులు మృతిచెందగా.. 723 మంది లొంగిపోయారన్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నక్సల్స్ కట్టడి విషయంలో చురుగ్గా వ్యవహరిస్తోందని ప్రశంసించారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రాలు చురుగ్గా వ్యవహరిస్తే, ఈ సమస్య శాశ్వతంగా తొలగిపోయినట్లేనని వివరించారు. ఈ సమయంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రంతో సమన్వయంతో పనిచేయాలన్నారు.
Also Read: అత్యుత్సాహం చూపిస్తున్న ఆ నేతలు.. తల పట్టుకుంటున్న పార్టీ పెద్దలు?
అభివృద్ధితో చెక్..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. పదేళ్లలో మోదీ సర్కార్ చేసిన అభివృద్ధి గురించి వివరించారు. పదేళ్లలో 11,500 కిలోమీటర్ల మేర రోడ్ నెట్వర్క్తో పాటు 15,300 సెల్ఫోన్ టవర్లను ఏర్పాటుచేశామని, ఏజెన్సీ ప్రాంతాలలో 165 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ఏర్పాటుచేశామని గుర్తుచేశారు. గతంలో హింసాత్మక ఘటనలు 16,400కు పైగా జరగగా, ప్రస్తుతం వాటి సంఖ్య 7,700లకు పడిపోయిందన్నారు. గతంలో కంటే పౌరులు, భద్రతా బలగాల మరణాలు 70 శాతం తగ్గాయని, దేశంలోని మావోయిస్ట్ హింసా ప్రభావిత జిల్లాలు 96 నుంచి 42కు తగ్గాయి. హింసాత్మక ఘటనలు నమోదయ్యే పోలీసుస్టేషన్ల సంఖ్య 465 నుంచి 171కి తగ్గిందని లెక్క చెప్పారు.