నిజామాబాద్, స్వేచ్ఛ: హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్లో నిర్వహించిన సభలో అసదుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన నెక్లెస్ రోడ్నూ ప్రభుత్వం కూల్చేస్తుందా? అని నిలదీశారు. హైడ్రా పేరుతో పేదలను ఇబ్బందిపెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
వాటి సంగతేంటి?
జీహెచ్ఎంసీ ఆఫీస్, సెక్రటేరియట్, బాపు ఘాట్ వంటి అనేక కట్టడాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని, మరి ప్రభుత్వం వాటినీ కూల్చేస్తుందా? అని ఫైర్ అయ్యారు. కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో పేదల సంక్షేమం కూడా ఉందని మర్చిపోవద్దని అన్నారు. రాష్ట్ర పరిపాలన సాగుతున్న సచివాలయమే ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు, పేదల ఇండ్లు ఉంటే ఇబ్బంది ఏమిటని అని సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధికి మాత్రం తాము మద్దతు ఇస్తామని, కానీ పేదలు ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు.
Also Read: అత్యుత్సాహం చూపిస్తున్న ఆ నేతలు.. తల పట్టుకుంటున్న పార్టీ పెద్దలు?
మోదీ మాటలు వినలేకే..
గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్లో ఒక్క ముస్లిం ఎంపీ లేరని, అందుకే ఆయా ప్రాంతాల్లో మైనారిటీల అభ్యున్నతికి ఎంఐఎం అవసరముందని ఒవైసీ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కనుసన్నల్లో నడుస్తుందని విమర్శించారు. వక్ఫ్ బోర్డు చట్టం విషయంలో కేంద్రం అవాస్తవాలను తెరమీదికి తెస్తోందని ఆరోపించారు. గుజరాత్లోని సోమనాథ్లో దర్గాలు, స్మశాన వాటికలు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా అక్కడి ప్రభుత్వం 12 వందల ఏళ్ల చరిత్ర గల మసీదును, స్మశానవాటికను బుల్డోజర్లు పెట్టి కూలగొట్టిందన్నారు. బీజేపీ తీసుకురానున్న వక్ఫ్ బోర్డు బిల్లును పార్లమెంటులో ప్రతిఘటిస్తామని ప్రకటించారు. మహారాష్ట్ర, కశ్మీర్, హర్యానాలో బీజేపీ ఓటమి ఖాయమని అసదుద్దీన్ ఓవైసి అన్నారు. మోదీ ప్రసంగాలు వినలేకనే తాను పార్లమెంటుకు వెళ్లలేదని చెప్పారు.