Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా.. తమిళనాడుకు చెందిన కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ ట్రోలింగ్ కి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు జనసైనికులు సైతం సిద్దమయ్యారు. ఇప్పటికే మధురైలో వంజీనాథన్ అనే న్యాయవాది పోలీసు కమిషనర్కు పవన్ పై ఫిర్యాదు చేశారు. ఇంతకు పవన్ వర్సెస్ స్టాలిన్ గా సాగుతున్న రోజురోజుకు చిలికిచిలికి గాలివానగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇటీవల తిరుపతి వారాహి సభ నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఈ విమర్శలకు కారణం గతంలో సనాతన ధర్మానికి తాను వ్యతిరేకం అంటూ ప్రకటించిన ఉదయనిధి స్టాలిన్ కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యల కారణంగా పవన్.. తమిళంలో మాట్లాడుతూ విమర్శలు ఎక్కుపెట్టారు. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను ముందుంటానని.. హిందుత్వాన్ని పాటిస్తూ సకల మతాలను గౌరవిస్తానన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు ట్రస్ట్ ఉండాల్సిన అవసరం ఉందని, హిందుత్వం జోలికి వస్తే సహించనని ప్రకటించారు.
ఇక ఉదయనిధి స్టాలిన్ లక్ష్యంగా.. పవన్ విమర్శలు చేయడంపై ఆయన అనుచరగణం భగ్గుమన్నారు. అలాగే మధురైలో అయితే న్యాయవాది ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. హిందూత్వం పేరుతో, తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్ పై విమర్శలు చేస్తున్నారని ఫిర్యాదు నిచ్చారు ఆ న్యాయవాది.
ఇక అంతే మధురైలో జనసేనానిపై కేసు నమోదు కాగా.. ఏపీలో జనసైనికులు అలర్ట్ అయ్యారు. అయితే సోషల్ మీడియా ద్వారా.. తమిళనాడుకు చెందిన కొందరు అదే పనిగా పవన్ ను విమర్శిస్తూ కామెంట్స్ చేయడం, పోస్ట్ చేయడం, అలాగే నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలను వైరల్ చేస్తుండగా.. జనసైనికులు భగ్గుమన్నారు.
ఈ నేపథ్యంలో ఎవరైతే పవన్ లక్ష్యంగా ట్రోలింగ్ చేస్తున్నారో వారిపై.. జనసైనికులు ఏపీ పోలీసులకు ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు. దీనితో పలు పోలీస్ స్టేషన్ ల పరిధిలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు జనసైనికుల నుండి అంత స్పందన లేనప్పటికీ.. తమ పార్టీ అధినేతపై వేలెత్తి చూపే పోస్టింగ్స్ పట్ల.. జనసైనికులు కూడా ట్రోలింగ్ బ్యాచ్ కి స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం రోజురోజుకూ వివాదాస్పద మార్గంలో సాగుతుందని, దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందోనన్న చర్చ ఊపందుకుంది.