Ap Govt Scheme: యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం తరపున ముందడుగు వేస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తాజాగా ఏపీలోని ఆలయాలకు అందించే ధూప, దీప నైవేద్య సాయంను పెంచడం జరిగిందన్నారు.
రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ యువగళం పాదయాత్రలో ప్రతి జిల్లాలో నెలకొన్న సమస్యలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏయే వృత్తుల వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సంధర్భంగా ఆలయాలలో అర్చకత్వం చేస్తున్న బ్రాహ్మణులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ కి వివరించారు. అందులో ప్రధానంగా.. ఆలయాలకు ధూప, దీప నైవేద్య సాయంను ప్రభుత్వం తరపున రూ.5 వేలు అందుతుందని, కానీ ఆ సాయం తగిన రీతిలో సరిపోవట్లేదని వారు తెలిపారు. ఈ విషయంపై నాడు వారికి లోకేష్ హామీ ఇచ్చారు.
తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా.. లోకేష్ తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించారు. దసరా పర్వదినం సంధర్భంగా.. అర్చకులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరపున ప్రకటన విడుదల చేశారు. ఆలయాల్లో ధూప, దీప నైవేద్యం కొరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే అభిప్రాయంతో, నెలకు ఇప్పటివరకు అందించిన రూ. 5 వేల సాయాన్ని, ఇక నుండి రూ.10 వేలకు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.
దీనితో రాష్ట్రంలోని 5400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్పడుతుందని లోకేష్ స్పందించారు. ప్రభుత్వ ప్రకటనపై ఆలయాల అర్చకులు, కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే హిందూ సమాజం సైతం.. ఆలయాలలో నిరంతరం జరిగే ధూప, దీప నైవేద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి.. సాయాన్ని పెంచడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. దసరా సమయంలో ప్రభుత్వ ప్రకటన ఆలయాల పరిరక్షణకు, అభివృద్దికి పట్టం కట్టే విధంగా ఉందంటూ అర్చకులు తెలిపారు.
Also Read: Minister Durgesh: అస్సలు అర్థం కావడం లేదు.. ఏమీ తోచడం లేదు.. ఆ ప్యాలెస్ పై మంత్రి కామెంట్
ఇలా ఒక్కొక్క హామీలను నెరవేరుస్తూ.. చెప్పిన, చెప్పని ప్రతి హామీని అమలుపరుస్తూ.. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందని లోకేష్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వరదల సమయంలో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకొనేందుకు సాయం ప్రకటించిందని, ఇప్పటికే ప్రజల ఖాతాల్లో నగదు జమ అయిందన్నారు. పెండింగ్ లో ఉన్న వారికి కూడా సాధ్యమైనంత త్వరగా నగదు జమ అవుతుందన్నారు.