Minister Jupalli: పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం అమెరికాకు బయలుదేరివెళ్లారు. IMEX అమెరికా 2024 పేరిట లాస్ వేగాస్ లో నిర్వహిస్తున్న అతి పెద్ద వాణిజ్య ప్రదర్శనలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు. ఆదివారం దుబాయ్ నుంచి అమెరికా వెళ్లారు. సోమవారం అక్టోబర్ 7న వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. అక్టోబర్ 8న లాస్ ఏంజెల్స్, అక్టోబర్ 9, 10న లాస్ వెగాస్, అక్టోబర్ 11న అట్లాంటాలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో జూపల్లి పాల్గొననున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని అక్టోబర్ 12న ఇండియాకు చేరుకుంటారు. తెలంగాణ పర్యాటక రంగానికి కలిసి వచ్చే అంశాలను సద్వినియోగం చేసుకుంటూ పర్యాటక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించడం, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికా పర్యటన కొనసాగనున్నది.
Also Read: శరన్నవరాత్రి వేడుకలు… ఎక్కడెక్కడ భారీగా జరుగుతున్నాయో తెలుసా..?
ప్రపంచ సమావేశాలు, ఈవెంట్లు, ప్రోత్సాహక ప్రయాణాల కోసం నిర్వహించే ఈ అతిపెద్ద వాణిజ్య ప్రదర్శనలో అమెరికా, ఇండియా, మెక్సికో, కెనడా, బ్రెజిల్, దుబాయ్ తోపాటు పలు దేశాలు పాల్గొననున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే సరఫరాదారులు, కొనుగోలుదారులను ఒకేచోటకు చేర్చే అంతర్జాతీయ గమ్యస్థానంగా IMEX నిలవనున్నది. ఆయా దేశాలు తమ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, కీలకమైన కొనుగోలుదారులతో సన్నిహిత సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు, వ్యాపార పర్యాటక భవిష్యత్ విషయమై IMEX ఒక వేదిక కానున్నది.