AP Govt: ప్రభుత్వం జమ చేయాల్సిన నగదు మీకు జమ కాలేదా.. అయితే డోంట్ వర్రీ.. మీ ఖాతాలో జమ కావాల్సిన నగదు ఖచ్చితంగా జమవుతుందంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అది కూడా ఎప్పుడో కాదు.. రేపే. సోమవారం సాయంత్రానికి నగదు జమ తప్పనిసరి అంటూ ప్రజలకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంతకు ఏంటా నగదు.. ఎవరికి ఆ నగదు జమ అనే విషయాలు తెలుసుకుందాం.
ఏపీలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు పోటెత్తాయి. దీనితో ఎక్కడ చూసినా జలకళ సంతరించుకుంది. కానీ ఈ జలకళ ఏమో కానీ రైతాంగం, సామాన్య ప్రజానీకం ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక విజయవాడ నగరం పరిస్థితి అయితే దారుణం. రహదారులన్నీ జలమయం కాగా.. గృహాలలో నుండి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. మనిషి లోతు గల నీటిలో కూడా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే సాహసం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించిన తీరు అమోఘం.
సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో.. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. అది కూడా కేంద్రం నుండి ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. అంతేకాదు హెలికాప్టర్స్ సాయంతో ప్రజలకు అన్నం ప్యాకెట్లు అందించారంటే ఇక ఆ వరద ఉధృతి ఏవిధంగా ఉందో ఊహించవచ్చు. అటువంటి పరిస్థితుల నుండి విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అలాగే పలు జిల్లాలలో అయితే రైతులకు చేతికి అందివచ్చిన పంట సైతం నీటి పాలైంది.
ఇలా ఈ భారీ వర్షం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. దీనితో కేంద్రం సైతం తన వంతుగా రాష్ట్రానికి తగిన సాయం అందించింది. ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థితిగతులు తెలుసుకున్న కేంద్రం వరదసాయం ప్రకటించింది. ఏపీని ఆదుకునేందుకు 1,036 కోట్ల రూపాయల నిధులను కేంద్రం అందించింది. దీనితో అసలే కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం అందించిన సాయం ఒక వరమనే చెప్పవచ్చు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి, పంట నష్టం కింద నష్టపోయిన వారికి ఆర్థిక సాయం వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని ప్రకటించగా.. బాధితులకు కొంత ఊరట లభించింది.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి రూ.602 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రజల ఖాతాల్లో రూ.569 కోట్ల సాయం జమ అయ్యింది. ఇక 21,768 మంది బ్యాంక్ ఖాతాల్లో వరదసాయం అందాల్సి ఉంది. వీరికి నగదు జమ కాకపోవడానికి ప్రధాన కారణం.. బ్యాంక్ ఖాతాలలో పొరపాట్లు జరగడమనేనని ప్రభుత్వం గుర్తించింది. పొరపాట్లు గుర్తింపు సరిచేసి వరదసాయం జమ చేస్తామన్న అధికారులు సోమవారం సాయంత్రానికి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ప్రకటన విడుదల చేశారు.