AP Deputy CM Pawan Kalyan: రాష్ట్ర వ్యాప్తంగా నీటి పారుదల శాఖ పరిధిలో వేల సంఖ్యలో ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్దతిన విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరికి గత కొన్నేళ్లుగా వేతనాలకు సంబంధించిన, ఉద్యోగపరమైన సమస్యలు ఉండగా.. గతంలో వాటి పరిష్కారం కోసం నిరసనలు సైతం తెలిపారు. అయితే ఎన్నికలు వచ్చాయి… కొత్త ప్రభుత్వం వచ్చింది.. అయినా తమ సమస్యలు తీరలేదంటూ.. వారు ఆందోళన బాట పట్టారు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తమ తీసుకెళ్లేందుకు ఏకంగా జనసేన కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఆర్.డబ్ల్యూ.ఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమ డిమాండ్లను వ్యక్తం చేస్తూ, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు.
తమ సమస్యల పట్ల ప్రభుత్వం నుండి సరైన స్పందన లేనందున, జనసేన నాయకత్వం ద్వారా తమకు న్యాయం చేయవలసిన ఆవశ్యకత ఉందని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టు విధుల్లో ఉన్నప్పటికీ, స్థిర ఉద్యోగుల వలె ప్రయోజనాలు అందడంలో విఫలమయ్యామని, ఇది ఆర్థికంగా వారికి తీవ్రంగా నష్టం కలిగిస్తోందని ఉద్యోగులు ఆరోపించారు.
రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ తరచుగా సామాన్య ప్రజల సమస్యలపై స్పందించేవారని, ఆయన తమ వేతన సమస్యలను కూడా పరిష్కరించేందుకు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Tirumala: తిరుమలకు వెయ్యి గోవులు ఇస్తా..ప్రభుత్వం సిద్ధమైనా?
తమ సమస్యలు పరిష్కరించడంలో జనసేన ప్రత్యేక చొరవ చూపుతుందన్న నమ్మకం ఉందని, కూటమిలో భాగమైన జనసేన తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. అలాగే డిప్యూటీ సీఎం హోదాలో గల పవన్.. ఇప్పటికే పంచాయతీలలో గల వేతనాల సమస్యలు పరిష్కరించారని, అదే రీతిలో తమను ఓ కంట చూడాలని వారు వేడుకున్నారు. ఎన్నో ఏళ్లుగా అలాగే తాము ఉద్యోగాలలో కొనసాగుతూ.. కష్టాలు భరించామని, ఇకనైనా పరిష్కారం చూపాలని వారు కోరారు.
అయితే పవన్ ను కలిసి తమ సమస్యలు విన్నవించగా.. సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలిపారు. తాము నిరసన చేపట్టింది.. కేవలం తమ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అంటూ.. పవన్ స్పందించిన తీరుకు ఆనందం వ్యక్తం చేశారు వారు.